Student Harassment: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురుకులం.. అహంకారపూరిత అధికారుల చేతుల్లో చిక్కి విలవిలలాడుతోంది. హుజురాబాద్ మండలంలోని బోర్నపల్లి శివారులో గల వీణవంక మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (ఎంజేపీ) లో గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఉపాధ్యాయుల మానసిక వేధింపులు భరించలేక, ఆత్మగౌరవం దెబ్బతిని పాఠశాల నుండి అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి ఇమ్మడి శశాంక్ ఆచూకీ లభ్యమైంది. తన కుమారుడు కనిపించకపోవడంతో ఆవేదనలో ఉన్న తండ్రి బాబయ్యకు, శుక్రవారం అర్ధరాత్రి జమ్మికుంటలోని తన స్నేహితుడి వద్ద శశాంక్ క్షేమంగా కనిపించాడు. శశాంక్ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఈ ఘటన పాఠశాల ముసుగులో జరుగుతున్న దారుణాలను, ప్రిన్సిపాల్ సంపత్ సాగిస్తున్న అరాచకాలను మరోసారి సమాజం ముందుకు తెచ్చింది.
కందుగుల గ్రామానికి చెందిన బాబయ్య మున్సిపల్ స్వీపర్గా పనిచేస్తూ తన కుమారుడిని చదివిస్తుంటే, ఆ పిల్లాడికి అండగా నిలవాల్సిన మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్, మరో టీచర్ షబీరా మేడమ్తో కలిసి విద్యార్థి తండ్రి వృత్తిని అత్యంత హీనంగా కించపరిచారు. “వీళ్ల డాడీ తాగుతాడు.. వీళ్లంతా ఇంతే, ఇలాగే తిరుగుతారు” అంటూ లౌడ్ స్పీకర్లో మాట్లాడుతూ విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. దీనిని నిలదీసిన తోటి విద్యార్థులను కూడా “అఫ్ట్రాల్ గాళ్లు” అంటూ టీచర్ శ్రీనివాస్ దూషించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ అవమానం భరించలేక, భయంతో శశాంక్ శుక్రవారం తెల్లవారుజామున పాఠశాల నుండి పారిపోయి రాత్రంతా బస్టాండ్ వద్దే గడిపినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు.
Also Read: Karnataka: బళ్లారి గురుకులంలో ఘోరం.. నిద్రిస్తున్న విద్యార్థులపై దాడి
ఈ పాఠశాలలో అరాచకాలు ఇప్పుడే మొదలైనవి కావు. గతంలో సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయనే నెపంతో ప్రిన్సిపాల్ సంపత్, ఒక పోలీస్ కానిస్టేబుల్తో కలిసి 16 మంది విద్యార్థులను హాస్టల్ గదిలో మూడు రోజుల పాటు నిర్బంధించి బెదిరింపులకు గురిచేశారు. వారిపై “డ్రగ్స్, గంజాయి” ముద్ర వేసి బాలల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, ప్రిన్సిపాల్ సంపత్ విద్యార్థులతో బలవంతంగా తన కాళ్లు మొక్కించుకున్నారని, చదువులో వెనుకబడిన వారిని “ఛీ నీ బతుకు చెడా” అంటూ నీచంగా తిడుతుంటారని విద్యార్థులు గొంతెత్తారు. ఫేర్వెల్ పార్టీల పేరుతో చందాల దందా చేయడం, విద్యార్థులకు అందాల్సిన కాస్మెటిక్ ఛార్జీలను ఉపాధ్యాయులే కాజేయడం ఇక్కడ బహిరంగ రహస్యమని ఆరోపిస్తున్నారు.
విద్యార్థి శశాంక్ క్షేమంగా దొరికినప్పటికీ, ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన ప్రిన్సిపాల్ సంపత్, మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్, షబీరా మేడమ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పేద విద్యార్థుల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ‘వేధింపుల కేంద్రం’పై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Forest Controversy: పవన్ శాఖలో గందరగోళం.. తిరుపతిలో ఫారెస్ట్ అధికారుల హడావిడి