Sumanth Investigation:గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ హైలెట్ అవుతున్న కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకి ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు అయ్యారు.దీంతో ఒకరకంగా ఈ కేసు దర్యాప్తులో వేగం పెరుగుతుందనే చెప్పాలి.
ఇక ఈ మధ్యే నాంపల్లి కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశించిన విధంగా ఆయన దర్యాప్తు చేసే అధికారుల ముందుకి వచ్చి రూ.25 వేల విలువైన రెండు వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించారు.మొత్తంగా ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇక నుంచి మొదలవబోతుందన్న మాట.
ప్రస్తుతం అందరి చూపు సుమంత్ విచారణ పైనే ఉందని చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు మరో ముగ్గురు నిందితులను ప్రశ్నించారు. ఆ విచారణలో నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు,వారి మధ్య ఉన్న సంబంధాలు, ఇక బెదిరింపులకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది, వాటికి సరైన ఆధారాలు ఉన్నాయా లేదా అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే కాని తెలిసేలా లేదు.
ఈ కేసులో ఉన్న నిందితులు ఎవరు ఎవరితోఎప్పుడు మాట్లాడారు, వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక బెదిరింపుల ఆరోపణల వెనుక అసలు విషయాలు తెలుసుకోవడానికి ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్లు వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో విశ్లేషించేందుకు సిద్ధమవుతున్నారు కూడా.
ఇక ఇప్పటికే విచారించిన ముగ్గురు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను, ఇప్పుడు సుమంత్ చెప్పే వివరాలతో పోలీసులు పోల్చి చూడనున్నారు. ఒకవేళ ఇద్దరి సమాధానాల్లో ఏమైనా తేడాలు కనిపిస్తే, సుమంత్ను మరిన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విచారణలో సుమంత్ ఇచ్చే సమాధానాలపైనే అందరి దృష్టి ఉంది.
ఇక కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల సుమంత్కు ప్రస్తుతం అరెస్ట్ కాకపోయినప్పటికీ పోలీసుల దర్యాప్తుకు ఆయన పూర్తిస్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. ఇక పాత నిందితుల స్టేట్మెంట్లు, సుమంత్ నుంచి సేకరించే వివరాలు, బ్యాంకులకి సంబంధించిన కీలక ఆధారాలని కలిపి ఒక నివేదిక తయారు చేయనున్నట్టు తెలుస్తుంది.
ఇక కేసు విషయానికి వస్తే.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై రియల్ ఎస్టేట్ వ్యాపారి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైన సంగతి తెల్సిందే. తనను పిలిపించి బెదిరించడంతో పాటు దాడి చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేశారని హరికృష్ణ ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుమంత్తో పాటు మరికొందరి పేర్లు కూడా కేసులో నమోదయ్యాయి. ఇప్పటికే కొందరు నిందితులను పోలీసులు విచారించినట్లు సమాచారం.
వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఆర్థిక లావాదేవీలు, పరస్పర సంబంధాలపై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సుమంత్ పోలీసుల ముందు హాజరై విచారణ ఎదుర్కొంటుండటంతో కేసులో ముఖ్యమైన విషయాలు బయటపడతాయా చూడాలి.