Khammam Murder: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మంలో చోటు చేసుకున్న దారుణ ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపి, కారులోనే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి పార్క్ చేసి, ఘటనను తన స్నేహితునికి ఫోన్ ద్వారా సమాచారం అందించిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఫోన్ సిగ్నల్ ద్వారా ఖమ్మం పోలీసులు నిందితుడి ఆచూకీని పసిగట్టి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇల్లెందుకు చెందిన మేడిపల్లి విద్యాసాగర్ (44) అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు, కొంత కాలం తర్వాత తనకు పరిచయమైన చిన్నబోయిన రేణుక అనే మహిళను 4 నెలల క్రితం రెండో వివాహం చేసుకుని ఖమ్మంలో రేణుకతో కలిసి నివాసముంటున్నాడు. అయితే రేణుకకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో విద్యాసాగర్ రేణుక ఇరువురి మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్ బుధవారం సాయంత్రం భార్య రేణుకను తన కారులో ఎక్కించుకుని బయటకు తీసుకువెళ్లాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే ఇరువురి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఈ పరిణామాల్లోనే విద్యాసాగర్ రేణుక గొంతు నులిమి చంపేశాడు.
Also read: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!
తాను తన భార్యను చంపినట్లు విద్యాసాగర్ ఇల్లెందులోని తన స్నేహితునికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. తాను కూడా చనిపోతున్నట్లు తెలిపాడు. దీంతో విద్యాసాగర్ స్నేహితుడు కలవరపడి రఘునాథపాలెం సీఐకి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో సీఐ అప్రమత్తమై విద్యాసాగర్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని ఆచూకీని కనిపెట్టారు. 10.30 గంటల ప్రాంతంలో ఖమ్మం-ఇల్లెందు రోడ్డులోని ప్రగతి స్కూల్ దగ్గర విద్యాసాగర్ ఉన్నట్లు గ్రహించారు. విద్యాసాగర్ ఫోన్ నెంబర్ కు పోలీసులు రింగ్ చేసి, ప్రగతి స్కూల్ పక్కనే నిలిపి ఉంచిన ఓ కారు సమీపాన అతను ఉన్నట్లు గ్రహించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విద్యాసాగర్ గొంతు నులిమి చంపిన రేణుక మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఖమ్మం అర్బన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Also read: బిగ్బాస్ హోస్టింగ్కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!