రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. సంక్రాంతి తర్వాత ముమ్మరంగా అభ్యర్థుల ఎంపికను చేపట్టేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి తొలివారంలో పురపాలిక, పట్టణ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. సర్కారు నుంచి ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం తన పనిలో వేగం పెంచింది. గత సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు రావడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన పాలకవర్గాలే మొన్నటివరకు కొనసాగాయి. వీటికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి పాలకవర్గాలకు రావాల్సిన నిధులు సైతం పెండింగ్లోనే ఉన్నాయి. పాలకవర్గాలు ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కొత్త పాలకవర్గాలు లేక అభివృద్ధి సైతం కుంటుపడింది. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నది. ఈసారి అత్యధిక మున్సిపాలిటీలు గెలవడమే లక్ష్యంగా అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తున్నది. అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ ఎండా ఎగరాలని ఇటీవల సీఎం రేవంత్ మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ సైతం అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.
సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ అనుకున్న దానికంటే సీట్లు తగ్గడంపై అటు సీఎం రేవంత్తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రులు, ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. ఈసారి ఎటువంటి తప్పిదం జరగొద్దని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ వలన కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఈసారి రెబల్స్ బెడద లేకుండా గెలిచే అభ్యర్థులను నిలబెట్టాలని, రెబల్స్ను బుజ్జగించాలని జిల్లా ఇన్ చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఇక బీఆర్ఎస్ సైతం సర్పంచ్ ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టాలని కింది స్థాయి కేడర్ నుంచి జిల్లా స్థాయి నేతలను అప్రమత్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
Political Families: జగన్, కేటీఆర్, తేజస్వి, అందరూ ఇంతేనా? అన్నా చెల్లెళ్ల రాజకీయ బంధం కలేనా?
రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ను తలపిస్తున్నాయి. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపాలని అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీ యోచిస్తున్నట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.ఈక్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా ఇంటర్నల్ సర్వేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.అయితే, తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు క్యూ కడుతున్నట్టు తెలుస్తుండగా.. ఎవరికి ఎంపిక చేయాలనే అంశంపై వారు తలలు పట్టుకుంటున్నట్టు టాక్ వినిపిస్తున్నది.ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఆర్థికంగా తట్టుకుని నిలబడి, గెలిచే అవకాశాలు ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్టు టాక్. ఏదేమైనా స్థానిక ఎన్నికలు రాష్ట్రంలో మరోసారి ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ పోరును తీసుకురానున్నట్టు తెలుస్తోంది.ఈసారి ఆశావహులు, పార్టీలకు కలిసొస్తుందా? లేదా అనేది త్వరలోనే తేలనుంది.