Vikarabad District: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా చోటుచేసుకున్న హైడ్రామా స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని కీలకమైన విలమున్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఎక్ మామిడి గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి కారును పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో మల్లేష్ మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నిబంధనల ప్రకారం పోలీసులు కారును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మల్లేష్తో పాటు కారులో ఉన్న ఆయన భార్య పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కారును తీసుకెళ్లనిచ్చేది లేదని భీష్మించుకోవడమే కాకుండా అక్కడే రోడ్డుపై హల్చల్ చేసింది.
పోలీసులు తన భర్తను కొట్టారని, తాము సామాన్యులమని చూసి వేధిస్తున్నారని ఆ మహిళ ఆరోపించింది. తాను మహిళనని కూడా చూడకుండా పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని వాపోయింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె ఆందోళనకు దిగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో పోలీసులకు, సదరు మహిళకు మధ్య గట్టి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు ఆమెను శాంతింపజేసి, చట్టపరమైన చర్యలు చేపట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ALSO READ: Warangal: పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేత.. వరంగల్లో హైటెన్షన్.. ప్రస్తుతం ఇది పరిస్థితి