Warangal: వరంగల్లోని పైడిపల్లి మైసమ్మ ఆలయాన్ని అధికారులు కూల్చివేయడం స్థానికంగా పెను దుమారం రేపింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ ఆలయాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాట, లాఠీఛార్జ్తో వరంగల్ ములుగు రోడ్డు రణరంగంగా మారింది.
ఆలయ కూల్చివేతకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ములుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుంటోందని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని వారు నినాదాలు చేశారు. కూల్చిన చోటే తిరిగి ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు నిరసనకారులపై స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. ఈ తోపులాట , తొక్కిసలాటలో బీజేపీ నాయకుడు తిరుపతి కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరికొందరు కార్యకర్తలు కూడా ఈ ఘర్షణలో స్వల్పంగా గాయపడ్డారు.
అభివృద్ధి పేరుతో పురాతన ఆలయాలను కూల్చివేయడం సరికాదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇతర మతపరమైన కట్టడాల విషయంలో మౌనంగా ఉంటూ, కేవలం మైసమ్మ ఆలయాలనే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వారు ఆరోపించారు. ప్రస్తుతం పైడిపల్లి పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది.
ALSO READ: Anantapur Crime: వద్దు నాన్నా.. ప్లీజ్ వదిలేయ్ నాన్నా.. ఇద్దరు పిల్లల్ని కాలువలోకి..