Muduchintalapalli Municipality: స్వేచ్ఛ, బ్యూరో: మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో పన్నుల గణాంకాల విషయంలో స్పష్టత లోపం కనిపిస్తోంది. ఆన్లైన్లో నమోదైన వివరాలు, అధికారుల లెక్కలు పరస్పరం భిన్నంగా ఉండటం గమనార్హం. ఆన్లైన్ నమోదు ప్రకారం పన్నుల మొత్తం డిమాండ్ రూ.2.81 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.1.39 కోట్లు వసూలైనట్లు సమాచారం. దీని ప్రకారం సుమారు 49.67 శాతం వసూళ్లు జరిగినట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ రెవెన్యూ అధికారి అర్షద్ వివరాల ప్రకారం డిమాండ్ రూ.3.30 లక్షలు, వసూళ్లు రూ.3.05 లక్షలు ఉండి దాదాపు 90 శాతం వసూలు పూర్తయ్యిందని తెలిపారు.ఈ రెండు లెక్కల మధ్య వ్యత్యాసం స్థానికుల్లో సందేహాలకు దారి తీస్తోంది. కోట్లలో ఉన్న డిమాండ్, లక్షల స్థాయిలో చూపించడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మున్సిపాలిటీగా మారకముందు మండలంగా ఉన్న సమయంలో పన్నుల డిమాండ్ రూ.3 కోట్లకు పైగానే ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో రూ.2.81 కోట్లుగా నమోదు కావడం గమనార్హంగా మారింది. ఇంకా సుమారు వెయ్యికి పైగా ఆస్తుల డిమాండ్ ఆన్లైన్లో నమోదు కాలేదని మున్సిపల్ రెవెన్యూ అధికారి అర్షద్ వెల్లడిస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇస్తున్నారు. కానీ గత గ్రామ పంచాయతీ కాలంలో ఈ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తి పన్ను వివరములు అన్ని కూడా నమోదు చేయడం జరిగిందని అప్పటి అధికారులు తెలియజేశారు. అయితే వాటిలో కొన్ని ఆస్తుల నుంచి పన్నులు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది కానీ, అప్పటిలో గ్రామ పంచాయతీ కాలంలో పన్నులు చెల్లించిన వారికి రసీదు ఇచ్చినప్పటికీ ప్రస్తుత ఆన్లైన్ డిమాండ్ లో బాకీలు ఉన్నట్లుగా చూస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పన్నుల గణాంకాల పై పూర్తి స్పష్టత తీసుకురావాలని, వివరాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.