Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. దీనిపై విపక్ష బీఆర్ఎస్ సభ్యుడు హరీష్రావు లేవనెత్తిన పలు ప్రశ్నలకు అధికార పార్టీ సమాధానం ఇచ్చింది. నేరుగా సీఎం రేవంత్రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మూసీ సుందరీకరణపై అసెంబ్లీలో చర్చ
మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ సభ్యుడు హరీష్రావు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేస్తున్నారు? లక్ష కోట్లా? లక్షన్నర కోట్లా? ఇప్పటి వరకు మూసీ సుందరీకరణకు ఎన్ని నివాసాలు కూల్చివేశారు? మూసీ సుందరీకరణకు ప్రభుత్వం-ప్రైవేటు భూములు ఎన్ని సేకరిస్తున్నారు? గోదావరి జలాలు మల్లన్నసాగర్ నుంచి తెస్తున్నారా?
గోదావరి జలాలు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. రూ.14.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూలగొడితే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ లేవనెత్తిన పలు ప్రశ్నలపై సీఎం రేవంత్రెడ్డి వివరణ ఇచ్చారు.
ప్రాజెక్టుపై పూర్తి వివరాలు వెల్లడించిన సీఎం రేవంత్
మూసీ నది దాదాపు 240 కిలో మీటర్లు మేరా ప్రవహిస్తోందన్నారు. అనంతగిరిలో మొదలై చివరకు వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుందన్నారు. హిమాయత్ సాగర్ ఎగువున మూసీలో ఈసా నది కలుస్తుందన్నారు. ఈసాకు హిమాయత్ సాగర్, మూసీకి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులు ఉన్నాయని గుర్తు చేశారు. రెండు నదులు లంగర్హౌస్ ప్రాంతంలో బాపూఘాట్ వద్ద కలుస్తాయన్నారు.
గతంలో జలవనరులను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదన్నారు. జల వనరులను కలుషితం చేశారన్నారు. కబ్జాలు చేసి ఆ తర్వాత ఫాంహౌస్ లు కట్టారని వివరించారు. చివరకు ఫామ్ హౌస్ల డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారన్నారు. నిందితులపై ఉక్కుపాదం మోపి డ్రైనేజీలను కూలగొట్టి చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
నదీపరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై లండన్, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో అధ్యయనం చేసినట్టు వివరించారు. ప్రపంచస్థాయి నగరాల్లో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకుని వ్యాపార కేంద్రాలుగా మార్చారన్నారు. గుజరాత్ లో సబర్మతి అభివృద్ధి కోసం 60 వేల కుటుంబాలను తరలించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
యూపీలో గంగానది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేశారు. నదీ పరివాహన ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలు నిజాంలు తీర్చిదిద్దారని, ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేశారన్నారు. హైదరాబాద్లో మురుగు కాలువలను మూసీ నదిలో కలిపారని, దీనివల్ల నల్గొండ జిల్లా ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు.
ALSO READ: ప్రజల కోసమైనా కేసీఆర్ మౌనం వీడాలి-కవిత
మూసీ ప్రక్షాళన కోసం కన్సెల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని, మూడు సంస్థలు జాయింట్ వెంచర్ కింద పునరుద్ధరణకు చేపట్టాయన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు నీటిని నగరానికి తరలించాలని ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో నగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు 15 టీఎంసీలు, గండిపేటకు 5 టీఎంసీలు తరలించేందుకు ప్లాన్ చేసినట్టు వివరించారు.
అంతకుముందు మంత్రి శ్రీధర్బాబు ఈ ప్రాజెక్టుపై సమాధానం ఇచ్చారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్డీసీఎల్ చేపడుతోందన్నారు. రూ. 4,100 కోట్లతో ఏడీబీ రుణంతో ప్రాజెక్టు చేపడుతోందన్నారు. ప్రణాళిక, విశ్లేషణ, డిజైన్లపై 18 నెలల్లో డీపీఆర్ఎ సమర్పిస్తుందన్నారు.
బ్లూ, గ్రీన్, ల్యాండ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోందన్నారు. గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదన ఉందన్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఐదు జోన్లుగా విభజన జరిగిందన్నారు. మొదటి దశల 55 కిలో మీటర్ల మేరా మూసీ అభివృద్ధి ప్రాజెక్టు జరుగుతుందని వివరించారు.