IIT Hyderabad: ప్రస్తుత జాబ్ మార్కెట్ మందకొడిగా ఉన్నప్పటికీ, ఐఐటీ హైదరాబాద్ (IITH) విద్యార్థి సరికొత్త రికార్డు సృష్టించాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) చివరి సంవత్సరం చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ (21) అనే విద్యార్థికి నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ ట్రేడింగ్ సంస్థ ‘ఆప్టివర్’ (Optiver) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడాదికి ఏకంగా రూ. 2.5 కోట్ల భారీ వేతన ప్యాకేజీని అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
2008లో ఐఐటీ హైదరాబాద్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక విద్యార్థికి లభించిన అత్యధిక ప్యాకేజీ ఇదే కావడం విశేషం. గతంలో 2017లో వచ్చిన రూ. 1 కోటి ప్యాకేజీనే ఇప్పటివరకు అత్యధికంగా ఉండేది. వర్గీస్ ఈ ఏడాది జులై నుంచి నెదర్లాండ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
హైదరాబాద్లో పుట్టి పెరిగిన వర్గీస్, గతంలో ఇదే కంపెనీలో రెండు నెలల పాటు ఇంటర్న్షిప్ చేశారు. అక్కడ తన ప్రతిభతో ఆకట్టుకుని, ఆ ఇంటర్న్షిప్ను విజయవంతంగా ‘ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్’ (PPO)గా మార్చుకున్నారు. “మొదటి సంవత్సరం నుంచే నేను కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్పై దృష్టి పెట్టాను. దేశంలోని టాప్-100 ప్రోగ్రామర్లలో ఉండటం, ఐఐటీ కరికులమ్ నాకు ఇంటర్వ్యూలో ఎంతగానో ఉపయోగపడ్డాయి,” అని వర్గీస్ సంతోషం వ్యక్తం చేశారు.
వర్గీస్ మాత్రమే కాకుండా, మరో CSE విద్యార్థికి కూడా రూ. 1.1 కోట్ల ప్యాకేజీ లభించింది. ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్లో సగటు వేతనం (Average Package) కూడా భారీగా పెరిగింది. 2024తో పోలిస్తే ఇది 75% పెరిగి, రూ. 20.8 లక్షల నుంచి రూ. 36.2 లక్షలకు చేరింది. ప్లేస్మెంట్స్ మొదటి దశలో విద్యార్థులు మొత్తం 24 అంతర్జాతీయ ఆఫర్లను దక్కించుకున్నారు. కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాకుండా, కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆఫీస్ ఆఫ్ కెరీర్ సర్వీసెస్ ఫ్యాకల్టీ ఇన్-ఛార్జ్ మయూర్ వైద్య తెలిపారు.
Read Also: Telangana Assembly Sessions: మూసీ సుందరీకరణ.. బీఆర్ఎస్ ప్రశ్నలపై సీఎం రేవంత్ క్లారిటీ