Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అకాల వర్షాలు కొంత ఉపశమనాన్ని అందించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న వ్యవసాయ రంగానికి మాత్రం కోలుకోలేని దెబ్బ తీశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు పలు జిల్లాలను వణికించగా, రాబోయే రెండు రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
దంచికొట్టిన వాన.. కొట్టుకుపోయిన పంటలు..
అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో కురిసిన వడగళ్ల వాన భీభత్సం సృష్టించింది. బాలానగర్, మేడ్చల్ మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడి తోటలు నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉడిత్యాల ప్రాంతంలో వీచిన ఈదురు గాలుల ధాటికి వాహనాలు సైతం కొట్టుకుపోగా, కొత్త సూరారంలో పేద ప్రజల ఆశల గూడైన పెంకుటిల్లు నేలమట్టమైంది. వందలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీట మునగడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
హైదరాబాద్ ఆగం.. ఆగం..
ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. ఐటీ కారిడార్గా పేరొందిన మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ వంటి ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురవగా, రోడ్లన్నీ మంచు కురిసినట్టు తెల్లగా మారిపోయాయి. మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, బోరబండ, సూరారం, దుండిగల్, కొంపల్లిలో వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బాలానగర్, సుచిత్ర, గాజులరామారంల వంటి చోట్ల తేలికపాటి జల్లులు పడినప్పటికీ, నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.
కామారెడ్డి జిల్లాలో కూడా ప్రకృతి ప్రకోపం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ కురిసిన వడగళ్ల వానకు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు, చేతికి వచ్చిన పంట నేలపాలైంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. గాలివానల వల్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది, సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Also Read: డీలిమిటేషన్ పై పోరాటం.. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి- సీఎం రేవంత్ రెడ్డి
నైరుతి దిశ నుండి వీస్తున్న గాలులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే ఈ అకాల మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద లేదా పాత భవనాల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వ్యవసాయ శాఖ రైతులను హెచ్చరిస్తోంది.