Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్గ్రేషియా) అందించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
ఈ ప్రమాదానికి సంబంధించి తదుపరి సహాయక చర్యల నిమిత్తం, సౌదీ అరేబియాకు తక్షణమే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపాలని కేబినెట్ తీర్మానించింది. ఈ బృందంలో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఉంటారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు, వారి మత సంప్రదాయాల ప్రకారం సౌదీ అరేబియాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకుగాను, బాధిత కుటుంబాల నుంచి ఒక్కో కుటుంబానికి ఇద్దరు సభ్యులను ప్రభుత్వ ఖర్చులతో అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు, కేబినెట్ సమావేశం ప్రారంభంలో ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం తెలిపింది. ఆయన సేవలను స్మరించుకుంది. అందెశ్రీ జ్ఞాపకార్థం ‘స్మృతి వనం’ ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.