Telangana Congress: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరా భవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA), సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు (SSA)లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగిన ఈ సమావేశాలకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఒక రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించి, కేవలం 30 లక్షల కొత్త ఓట్లను మాత్రమే జాబితాలో చేర్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఓటర్ల తొలగింపు ప్రక్రియ కూడా ఒక కారణమని ఆరోపించారు.
గాంధీ భవన్లో BLA, SSAల సమీక్షా సమావేశం
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, ఇందులో BLAల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
BLAలకు త్వరలోనే TPCC ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. pic.twitter.com/q3iPCtFUwY
— Congress for Telangana (@Congress4TS) May 30, 2026
బీజేపీ తదుపరి లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక నిఘా ఉంచుతుందని తెలిపారు. ప్రతి వారం మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై దృష్టి సారిస్తారని ఆయన వెల్లడించారు. మరోవైపు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
Also Read: అమెరికాలో పాడుపని.. ముగ్గురు భారతీయులకు జైలు శిక్ష.. ఏం జరిగిందంటే?
అంతకుముందు ఎస్ఐఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సైతం మాట్లాడారు. ఎస్ఐఆర్ వల్ల దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్ఐఆర్ వల్ల తలెత్తే సమస్యలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఇంఛార్జ్ లు తప్పని నియోజకవర్గంలో ఉండాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. ఇంఛార్జ్ లు సరిగ్గా పనిచేస్తే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా చూడొచ్చని అన్నారు. ఇంఛార్జులు, మంత్రులు ప్రతీ 10 రోజులకు ఒకసారి పార్టీ కార్యక్రమాల కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను ఇంఛార్జ్ మంత్రులు కలవాలని పిలుపునిచ్చారు.
Also Read: దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు.. దిల్లీ, ముంబయిలో పేలుళ్లకు కుట్ర.. 9 మంది అరెస్టు