Synthetic Drugs: తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ (Eagle Force) తన కార్యాచరణను ముమ్మరం చేసింది. సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీని వేళ్ళతో సహా పెకిలించేందుకు బంజారాహిల్స్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం కీలక నిర్ణయాలకు వేదికైంది.
ఉన్నత స్థాయి సమన్వయ సమావేశంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ, ఫ్యాక్టరీల శాఖ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (TGPCB) ప్రముఖులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించకుండా.. సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవడంపై ప్రధానంగా చర్చించారు.
పలుచోట్ల ఉన్న రసాయన యూనిట్లు, ఫార్మా ల్యాబ్లు, ఆర్&డీ (R&D) కేంద్రాలపై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని నిర్ణయించారు. అనుమానిత కార్యకలాపాలపై సమాచారాన్ని తక్షణమే పంచుకునేలా ‘రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్’ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ముందస్తు సమాచారం లేకుండానే అనుమానిత పరిశ్రమలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించనున్నారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లను అక్రమంగా అద్దెకు ఇవ్వడం లేదా అనధికారికంగా డ్రగ్స్ తయారీకి వాడటం వంటి చర్యలపై ఈగిల్ ఫోర్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే యాజమాన్యాలపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.
ఐరన్ ఫిస్ట్ (Iron Fist) విధానంతో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఈగిల్ ఫోర్స్ స్పష్టం చేసింది. కేవలం తయారీదారులే కాకుండా.. వారికి ముడిసరుకు సరఫరా చేసేవారు , రవాణా చేసే నెట్వర్క్లను కూడా తుడిచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ అనుమతుల పేరుతో అక్రమ రసాయనాల వినియోగం జరగకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటాను కూడా క్షేత్రస్థాయి తనిఖీలతో సరిపోల్చనున్నారు. ఈ కఠిన చర్యల ద్వారా తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్ లభ్యతను పూర్తిగా అరికట్టి, యువతను వ్యసనాల బారి నుండి రక్షించడమే ప్రభుత్వ అంతిమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
Also Read: ఆక్రమణలపై హైడ్రా పంజా.. రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం!