Chandrababu – Bandla Ganesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం కలుసుకున్నారు. అసెంబ్లీలోని ఛాంబర్ లో సీఎంతో సమావేశమై.. తిరుమల నుంచి తీసుకొచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. గత వైసీపీ పాలనలో చంద్రబాబు జైలుకెళ్లగా.. ఆయన బయటకు వస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేశ్ మెుక్కుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఇంటి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి రెండ్రోజుల క్రితమే స్వామి వారిని దర్శించుకున్నారు.
తన కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లిన బండ్ల గణేశ్ ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. ఆయన్ను దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పాదయాత్ర జరిగిన తీరుతెన్నులను సీఎం అడిగి తెలుసుకున్నారు. తన క్షేమం కోసం చేసిన ఈ పాదయాత్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు తన పాదయాత్ర సాగిన తీరును చంద్రబాబుకు బండ్ల గణేశ్ వివరించారు. దారిపొడవునా టీడీపీ నేతలు, కార్యకర్తలు అండగా నిలుస్తూ ప్రోత్సహించిన విధానాన్ని ఆయనకు వివరించారు.
సినీ నిర్మాత బండ్ల గణేశ్.. సంకల్ప యాత్ర పేరుతో షాద్నగర్ ఇంటి నుంచి జనవరి 19న పాదయాత్ర చేపట్టి ఈ నెల 10వ తేదీన తిరుమలకు చేరుకున్నారు. 23 రోజుల పాటు 535 కి.మీ మేర బండ్ల గణేష్ పాదయాత్ర సాగింది. మంగళవారం తిరుమల చేరుకున్న సందర్భంగా బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తిరుమలకు పాదయాత్రగా రావడంతో ఈ జన్మలో అద్భుతమైన ఘట్టంగా పేర్కొన్నారు. కాగా తిరుమలకు వచ్చిన గణేశ్ కు.. తెలుగు దేశం పార్టీ నేతలు, టీటీడీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. దగ్గరుండి ఆయనకు శ్రీవారి దర్శనం చేయించారు.
Also Read: Panasonic New ACs: కొత్త ఏసీ కావాలా? పానాసోనిక్ నుంచి అడ్వాన్స్డ్ ఏసీలు.. 57 రకాల మోడళ్లలో..!
గత వైసీపీ పాలనలో స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 2023 సెప్టెంబరు 9న నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకొని.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడి నుంచి 53 రోజుల పాటు చంద్రబాబు జైలులోనే గడిపారు. చివరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో టీడీపీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా జెైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అనంతరం రాజమండ్రి జైలు బయట టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తును అధికారికంగా ప్రకటించారు.
Also Read: AP Legislative Council: బొత్స vs పార్థసారధి.. మండలిలో వాడీ వేడీ చర్చ.. నేతల మధ్య తీవ్ర వాగ్వాదం