Telangana Education Policy: తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఏర్పాటైన విద్యా కమిషన్ తన ప్రతిష్టాత్మక నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఆకునూరి మురళి నేతృత్వంలోని ఈ కమిషన్ ప్రీ-ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్” పేరుతో కొత్త నమూనాను కమిషన్ పరిచయం చేసింది. కొత్త భవనాల నిర్మాణానికి బదులుగా ఉన్న పాఠశాలలనే ఆధునికీకరించి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించింది. మొదటి దశలో 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 100 మండలాలను ఎంపిక చేసి 200 పాఠశాలలను ఈ నమూనాలోకి మార్చేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ఆమోదం తెలిపారు.
ఈ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, 24 గంటల భద్రత వంటి వసతులు ఉండనున్నాయి. విద్యార్థుల రవాణా కోసం బస్సు సౌకర్యాన్ని కల్పించనుండగా దీనికయ్యే ఖర్చులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 40 శాతం బ్యాంక్ లోన్లు.. 10 శాతం తల్లిదండ్రుల భాగస్వామ్యంతో సమకూరుస్తారు. పౌష్టికాహారం అందించేందుకు మండల స్థాయిలో సెంట్రల్ కిచెన్లను ఏర్పాటు చేసి నాణ్యమైన అల్పాహారం.. భోజనం అందించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు చేస్తుండగా.. ఈ కొత్త నమూనాలో అత్యాధునిక వసతులతో కలిపి కేవలం 50 వేల రూపాయల లోపే ఖర్చవుతుందని కమిషన్ అంచనా వేసింది.
ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పుగా టీజీ ఈఏపీసెట్ (గతంలో ఎంసెట్) రద్దును కమిషన్ ప్రతిపాదించింది. ఇంజనీరింగ్.. అగ్రికల్చర్.. ఫార్మసీ ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్షలకు బదులుగా ఇంటర్మీడియట్ మార్కులనే ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసి కేవలం 10.. 12 తరగతులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడమే ఈ నివేదిక ప్రధాన ఉద్దేశం.
పాఠశాల విద్య.. ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి ఒకే బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. విద్యా ప్రమాణాలను పెంచేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులను 35 శాతం నుండి 45 శాతానికి పెంచాలని సూచించింది. జూనియర్ కాలేజీల పేరుతో నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై కఠిన నియంత్రణ ఉండాలని.. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. రాబోయే ఐదేళ్లలో 2,000 పాఠశాలల ఏర్పాటు కోసం 36 వేల కోట్ల రూపాయల రోడ్ మ్యాప్ను కమిషన్ ప్రభుత్వానికి వివరించింది.
Read Also: CM Revanth Reddy: గరం.. నరం.. బేశరం కావొద్దు.. నిబద్ధతతో పనిచేయాలని గ్రూప్-1 అధికారులకు సీఎం హితవు