తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అందులోభాగంగా ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకురానున్నది వ్యవసాయ శాఖ. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మక అమలు చేయనుంది. రబీ ముందస్తు ప్రణాళికపై వ్యవసాయ, ఉద్యాన అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు.
యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటోంది వ్యవసాయశాఖ. యాప్ ద్వారా సమీ ప డీలర్ వద్ద యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైతులు కావాల్సిన పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు బుకింగ్ ఐడి వెళ్తుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగానే డీలర్ ద్వారా యూరియా విక్రయం జరుగుతుంది.
పంట పేరు, సాగు విస్తీర్ణం నమోదు చేస్తే అర్హత మేరకు యూరియా లెక్కింపు జరుగుతుంది. యూరియా దుర్వినియోగం అరికట్టడమే లక్ష్యంగా యాప్ తీసుకువస్తోంది ప్రభుత్వం. అధిక యూరియా వినియోగం వల్ల నష్టాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై కూడా అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతారు. కౌలు రైతులకు కూడా యాప్లో ప్రత్యేక సదుపాయం కల్పించనున్నారు.