Fuel Shortage: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఆదివారం అర్ధరాత్రి నుంచే అనేక పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడంతో, సోమవారం ఉదయం నుంచే ప్రజలు ఇంధనం కోసం బంకుల చుట్టూ పరుగులు తీశారు. హైదరాబాద్తో పాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. కొద్దిపాటి స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని బంకుల వద్ద టోకెన్ పద్ధతిని అమలు చేస్తూ, ద్విచక్ర వాహనాలకు రూ. 500, కార్లకు రూ. 2000 చొప్పున పరిమితి విధించడం వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
పంట కోతల సీజన్.. రైతన్నకు తప్పని కష్టాలు
ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ కీలక సమయంలో డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. హార్వెస్టర్లు, ట్రాక్టర్లు నడవాలంటే డీజిల్ అత్యవసరం, కానీ బంకుల వద్ద డీజిల్ దొరక్క రైతులు తమ పనులను మధ్యలోనే నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యవసాయ పనులకు ఆటంకం కలిగితే పంట నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాలు, కూరగాయలు వంటి నిత్యవసర వస్తువుల రవాణాపై కూడా ఈ ప్రభావం పడుతోంది, ఇది భవిష్యత్తులో ధరల పెరుగుదలకు దారితీస్తుందేమోననే భయం సామాన్యుల్లో మొదలైంది.
కృత్రిమ కొరత వెనుక అసలు కారణమేంటి?
అయితే ఈ సంక్షోభం వెనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్లక్ష్యం, డీలర్ల ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాము ముందుగానే నగదు చెల్లించినప్పటికీ, ఆయిల్ కంపెనీలు సకాలంలో ఇంధనాన్ని సరఫరా చేయడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు వాపోతున్నారు. త్వరలో ఇంధన ధరలు పెరగనున్నాయనే వదంతులు మార్కెట్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ధరలు పెరిగిన తర్వాత అమ్మడం ద్వారా ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతోనే ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని డీలర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వం స్పష్టత.. భయపడాల్సిన పనిలేదు
ఈ పరిస్థితులపై స్పందించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమేనని, దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న కొరత, ప్రజల్లో ఉన్న అనవసరమైన భయాందోళనలేనని ఆయన వివరించారు. ధరలు పెరుగుతాయన్న అపోహతో ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవడం వల్లే బంకుల వద్ద రద్దీ పెరిగిందని పేర్కొన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడామని, తక్షణమే సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించామని, మంగళవారం నాటికి పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
నిఘా పెంచిన యంత్రాంగం
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం నిఘాను కట్టుదిట్టం చేసింది. ఇంధనాన్ని నిల్వ చేసి ఉంచిన బంకులపై దాడులు చేస్తామని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జిల్లా స్థాయి పౌరసరఫరాల అధికారులు బంకుల్లో తనిఖీలు నిర్వహిస్తూ, అందుబాటులో ఉన్న నిల్వలను వెంటనే విక్రయించాలని సూచిస్తున్నారు. ఎవరైనా ఇంధనాన్ని దాచిపెట్టినట్లు గుర్తిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ సరఫరా గాడిలో పడుతుందని ఆశించవచ్చు.
Also Read: కాశ్మీర్ను తలపించేలా.. హైదరాబాద్ శివార్లలో రోడ్లపై మంచు, ఎంజాయ్ చేసిన ప్రజలు