రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గృహ వినియోగ గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని ఆయన కోరారు. ఇంధన లభ్యతపై పౌర సరఫరాల శాఖ నిరంతరం నిఘా ఉంచిందని చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హాస్టళ్లు ఆసుపత్రులకు ఇంధన సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కమర్షియల్ గ్యాస్ విషయంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నాయని మంత్రి అంగీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో కమర్షియల్ గ్యాస్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రూమర్లు ఫేక్ న్యూస్ నమ్మవద్దని ప్రజలను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి డ్రమ్ములు కంటైనర్లలో ఇంధనం నింపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలో లీటర్ల సరఫరా అందుబాటులో ఉందన్నారు. హఠాత్తుగా డిమాండ్ 25 శాతం పెరిగినప్పటికీ 1200 ట్యాంకర్ల ద్వారా నిరంతరం సరఫరా కొనసాగిస్తున్నామని వివరించారు.
పెట్రోల్ బంకులను ఉద్దేశపూర్వకంగా మూసివేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్ సూరత్ నాగపూర్ చెన్నై వంటి నగరాల్లోనూ ఇటువంటి డిమాండ్ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధన రవాణాలో ఎక్కడా క్రెడిట్ సమస్య లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 596 పెట్రోల్ బంకుల్లో పౌర సరఫరాల సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు అక్రమాలకు పాల్పడిన వారిపై 175 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి 2954 వాణిజ్య సిలిండర్లను సీజ్ చేశామని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.
దురేందర్ సినిమాపై ఉత్తమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దురేందర్ సినిమా గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను దురేందర్-1 సినిమా చూశాను.. బాగుంది.. కానీ అందులో హింసను చాలా క్రూరంగా చూపించారు. అయితే, దురేందర్-2 సినిమాను నేను ఇంకా చూడలేదు. కానీ పార్ట్ -2 లో కొంత ప్రోపగండ ఉందంటూ ప్రచారం జరుగుతుంటే విన్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో కొంత హాట్ టాపిక్ గా మారాయి.