Land Resurvey: దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. క్షేత్రస్థాయిలో భూముల సరిహద్దుల లొల్లికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ‘రీ-సర్వే’ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతగా 25 జిల్లాల్లోని 373 గ్రామాలను ఎంపిక చేసి, అత్యాధునిక సాంకేతికతతో సర్వే నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. పట్టాలు లేని ఆ గ్రామాలకు సర్వే నిర్వహించి స్పష్టమైన రికార్డులను తయారు చేయనున్నది. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా 400 అత్యాధునిక రోవర్లను రంగంలోకి దించుతున్నారు. ఇవి సెంటీమీటర్ల స్థాయిలో కూడా కచ్చితమైన రీడింగ్ ఇస్తాయి. దీంతో పాటు డ్రోన్ లను కూడా వినియోగించనున్నారు. గాల్లో నుంచి భూమిని అత్యంత స్పష్టతతో ఫోటోలు తీసే ‘డ్రోన్ ఇమేజింగ్’ సాంకేతికతను వాడుతున్నారు. దీనివల్ల కొండలు, వాగులు, వంకలు ఉన్నచోట కూడా సర్వే సులభతరం కానుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రాథమికంగా 25 జిల్లాలను ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. భూ వివాదాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో మార్పులు అవసరమైన గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఫేజ్-1 విజయవంతమైన తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ సర్వేను పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
Also Read: CM Relief Fund: పాలకుర్తిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.. 323 మందికి రూ.1.18 కోట్ల ఆర్థిక సహాయం
సర్వే నంబర్ల అస్తవ్యస్తత, సరిహద్దుల గొడవలను తొలగించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. సర్వే నిర్వహించి ప్రతి గుంట భూమికి ఒక ‘డిజిటల్ సిగ్నేచర్ కేటాయిస్తారు. తర్వాత సర్వే ద్వారా వచ్చే కచ్చితమైన డేటాను ధరణి పోర్టల్లో అప్డేట్ చేస్తారు. దీని వలన భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చాలా సులభతరంగా మారతాయి. రోవర్లు, డ్రోన్ సర్వే ద్వారా భూమి వివరాలు పక్కాగా రికార్డు అవుతాయి. దీంతో ఇకపై ఎవరూ భూమిని ఆక్రమించుకునే అవకాశం ఉండదని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత పెరుగుతుంది.
ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోని గ్రామాలను ఎంపిక చేశారు. మరోవైపు ఈ సర్వేలో ప్రభుత్వ భూములకు కూడా మ్యాపింగ్ చేస్తారు. దీని వలన అవి కబ్జా కాకుండా కాపాడబడతాయని అధికారులు చెప్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొందిన సర్వేయర్లు ఈ భూమి మ్యాపింగ్ సర్వేలో పాల్గొననున్నారు. టెక్నాలజీ ఆధారంగా చేస్తున్న ఈసర్వేలో భాగస్వామ్యం కానున్నారు. ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున సర్వేయర్లు పాల్గొంటారని అధికారులు చెప్తున్నారు. వీరు ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో కొలతలు, హద్దులు ఏర్పాటు, పటాల రూపకల్పన తదితర అంశాలపై వర్క్ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్లు తీసుకున్న సర్వేయర్లకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కానున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన తర్వాత విడతల వారీగా అన్ని జిల్లాల్లోని అన్ని గ్రామాల్లోనూ ఈ సర్వే నిర్వహించనున్నారు. ప్రత్యేక మ్యాపింగ్ పూర్తి చేసి డిజిటల్ విధానంలో గ్రామ స్థాయిలోని భూముల వివరాలను తీసుకురానున్నారు.
Also Read: Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!