Cyber Fraud Alert: జరుగుతున్న సైబర్ మోసాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా కొందరు కేటుగాళ్ల ఉచ్ఛులో చిక్కుకుంటూనే ఉన్నారు. మోసపోయామని గుర్తించిన తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం ముగుస్తుండటంతో పోగొట్టుకున్న డబ్బులో పది శాతం కూడా వెనక్కి రావటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ మరోసారి బడా కంపెనీలను టార్గెట్ గా చేసుకుని ఉచ్చు విసురుతున్నారు. ఆయా కంపెనీల ఎండీ, డైరెక్టర్లు, కీలక స్థానాల్లో ఉన్నవారి ఫోటోలను డీపీలుగా పెట్టి నకిలీ వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మెసెజీలు పంపించి లక్షలు కొల్లగొడుతున్నారు.
డీజీపీగా పని చేసి రిటైరైన ఓ అధికారి మనవరాలు ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. 18కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్న ఓ ఉద్యోగికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సదరు మహిళా వ్యాపారవేత్త పంపించినట్టుగా ఉన్న ఆ మెసెజీలో తాను మీటింగులో ఉన్నానని…అర్జంటుగా 1.20కోట్ల రూపాయల డబ్బును ట్రాన్స్ ఫర్ చేయాలని ఓ అకౌంట్ నెంబర్ ఉంది. వచ్చిన మెసెజీ డీపీగా మహిళా వ్యాపారవేత్త ఫోటో ఉండటంతో నమ్మిన అకౌంటెంట్ వెంటనే 1.20కోట్ల రూపాయలను బదిలీ కూడా చేశాడు. మరో నాలుగు రోజుల తరువాత మరోసారి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాలని మెసెజీ రావటంతో అకౌంటెంట్ నిర్ధారించుకోవటానికి మహిళా వ్యాపారవేత్తకు ఫోన్ చేయటంతో జరిగిన మోసం బయట పడింది. ఇలాంటి మోసాలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా హైదరాబాద్ ల ఉన్న ఓ ప్రముఖ సంస్థలో అకౌంటెంట్ గా పని చేస్తున్న ఉద్యోగికి ఇలాగే ఆ సంస్థ సీఎండీ డీపీతో వాట్సాప్ మెసెజ్ పంపించి 1.95కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ కొట్టేశారు.
Also Read: Kawasaki Ninja 300 Offer: కవాసకీ నింజాపై క్రేజీ ఆఫర్.. 28 వేల తగ్గింపు, ఫ్రీ KYT హెల్మెట్!
ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ వేర్వేరు మార్గాల్లో ముందుగా ఫోన్ నెంబర్లను వేర్వేరు మార్గాల్లో కొని ఆ తరువాత నేరాలకు పాల్పడుతున్నట్టుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల్లోని కస్టమర్ కేర్ విభాగాల్లో పని చేస్తున్న కొంతమంది సిబ్బందికి డబ్బు ఆశ చూపించి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారన్నారు. దాంతోపాటు ఆ ఫోన్ నెంబర్లు కలిగి ఉన్నవారి వ్యక్తిగత వివరాలు మొత్తం తీసుకొంటున్నారని చెప్పారు. ఆ తరువాత పెద్ద పెద్ద కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న వారి ఫోటోలను సోషల్ మీడియా నుంచి డౌన్ లోడ్ చేసుకుంటున్నట్టు చెప్పారు. అనంతరం ఆ ఫోటోలను డీపీలుగా పెట్టి ఆయా కంపెనీల్లో పని చేస్తున్న అకౌంట్స్ ఆఫీసర్లకు వాట్సాప్ మెసెజీలు పెడుతున్నారని తెలిపారు. వచ్చిన మెసెజీలో తమ బాస్ ల ఫోటోలు ఉండటంతో వాటిని నిజమే అని నమ్ముతున్న అకౌంట్స్ ఆఫీసర్లు ముందూ వెనకా ఆలోచించకుండా డబ్బును ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు చెప్పారు. డబ్బు బదిలీ అయినట్టు బ్యాంకుల నుంచి ఎస్ఎంఎస్ లు వచ్చిన తరువాతగానీ జరిగింది మోసమని గ్రహించ లేకపోతున్నారన్నారు.
ఇలా వచ్చే వాట్సాప్ మెసెజీలను అస్సలు నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ చెబుతున్నారు. మెసెజ్ వస్తే వెంటనే ఫోన్ చేసి అది నిజంగా తమ పైవారు పంపించారా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. ఆయా సంస్థల యాజమాన్యాలు కూడా ఇలా జరుగుతున్న మోసాలపై అకౌంట్స్, ఫైనాన్స్, హెచ్ ఆర్, అడ్మి న్ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించాలని చెప్పారు. ఇలాంటి మెసెజీలు వస్తే నగదును ట్రాన్స్ ఫర్ చెయ్యకుండా 1930కి సమాచారం అందించాలన్నారు. ఒకవేళ నగదును బదిలీ చేసినా మొదటి గంటలోపే ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. అప్పుడు నగదు సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.