విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఓ నిరుపేద గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేక.. అటు కంపెనీ యాజమాన్యం ఇటు ఇండియన్ ఎంబసీ చేతులెత్తేసిన తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానవత్వంతో స్పందించి రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని గంటల వ్యవధిలోనే మంజూరు చేసింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (40) నాలుగు నెలల క్రితం ఓమాన్లోని సలాలాకు క్లీనింగ్ పని నిమిత్తం వెళ్లారు. అయితే, అక్కడి కంపెనీ పరిస్థితులు నచ్చక బయటకు వచ్చిన ఆయన, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మృతి చెందారు. అనుమతి లేకుండా కంపెనీ వీడి బయటకు రావడంతో అక్కడి చట్టాల ప్రకారం ఆయనను అక్రమ నివాసిగా పరిగణించారు. దీనిని సాకుగా చూపుతూ మృతదేహం తరలింపు బాధ్యతను కంపెనీ నిరాకరించింది. అటు మస్కట్లోని ఇండియన్ ఎంబసీ కూడా నిధుల కొరత ఉందని పేర్కొంటూ, ఖర్చులు భరించకపోతే ఓమాన్లోనే అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలపడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ప్రభుత్వం తక్షణ స్పందన..
ఈ క్లిష్ట పరిస్థితుల్లో మృతుడి భార్య చిన్న సావిత్రి తన కుమారుడితో కలిసి మంగళవారం హైదరాబాద్లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. నెల రోజులుగా భర్త మృతదేహం ఆసుపత్రి శవాగారంలోనే ఉండిపోయిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ముఖ్యమంత్రి కార్యాలయం అత్యంత వేగంగా స్పందించింది. కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి రూ. 1.50 లక్షల చెక్కును జారీ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు.
వ్యవస్థాగత లోపాలు..
మృతుడు అబ్బులు ప్రవాసీ భారతీయ బీమా యోజన (PBBY) కలిగి ఉన్నప్పటికీ, మృతదేహం తరలింపులో ఎంబసీ గానీ, విదేశీ వ్యవహారాల శాఖ గానీ చొరవ చూపకపోవడం గమనార్హం. మదద్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్పందించని పక్షంలో.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి పేద కుటుంబానికి అండగా నిలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.