Jallikattu Bull Festival: సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు సంప్రదాయ క్రీడలు జోరందుకుంటాయి. ముఖ్యంగా తమిళనాడులో జల్లికట్టును ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఒక్క తమిళనాడులోనే కాదు.. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టును జరుపుకుంటారు. దీని కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ జల్లికట్టు క్రీడ వేల సంవత్సరాల నాటిదని, సింధూ నాగరికత కాలం నాటి ముద్రికపై కూడా దీనికి సంబంధించిన చిత్రం ఉందని చరిత్రకారులు చెబుతుంటారు.
అంతేకాదు.. పురాతన తమిళ కావ్యాలలోనూ దీని గురించి ప్రస్తావన ఉంది. జల్లికట్టు అనేది తమిళనాడు సంస్కృతిలో భాగం. ముఖ్యంగా పొంగల్ పండగ సమయంలో బలాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించేందుకు ఎద్దులను మచ్చిక చేసుకునే సంప్రదాయంగా కూడా చెబుతారు. ఈ నేపథ్యంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ జల్లికట్టును ఎందుకు నిర్వహిస్తారు? జల్లికట్టు వెనుకున్న ఆచారం ఏమిటి? ఎందుకు జల్లికట్టుకు అంత ప్రాధాన్యత? వంటి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో కోడిపందేలు ఎంత ఫేమసో.. తమిళనాడులో జల్లికట్టు అంతే ప్రాధాన్యం కలిగిన ఆట. ఈ క్రీడ కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జల్లికట్టు కేవలం ఆట మాత్రమే కాదు.. తమిళనాడు సంస్కృతిలో బలంగా నాటుకుపోయిన ఒక సంప్రదాయం. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్రీడ గురించి పురాతన కావ్యాల్లోనూ, శిల్పాల్లోనూ ప్రస్తావనలు ఉన్నాయి. పొంగల్ పండుగ సమయంలో ధైర్యం, శారీరక బలం చూపించే వేదికగా జల్లికట్టును భావిస్తారు.
‘జల్లి’ మరియు ‘కట్టు’ అనే తమిళ పదాల కలయికే జల్లికట్టు. ఒకప్పుడు ఎద్దుల కొమ్ములకు లేదా మెడకు బంగారు లేదా వెండి నాణేలను కట్టేవారు. ఆ నాణేలను ఎద్దును లొంగదీసి తీసుకువచ్చినవారే విజేత. ఈ క్రీడను తమిళంలో ‘ఏరు తాజువుతల్’ లేదా ‘మంచువిరాట్టు’ అని కూడా పిలుస్తారు. దీని కోసం జల్లికట్టులో పాల్గొనే ఎద్దులకు ముందుగానే శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియను ‘మన్ కుతాల్’ అంటారు. మట్టిలో కొమ్ములతో తవ్వడం, ఒక్కసారిగా దూకడం వంటి అలవాట్లను ఎద్దులకు నేర్పిస్తారు. మూపురం పట్టుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. వెంటనే దాడి చేసేలా ఎద్దులకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.
జల్లికట్టు వెనుక ప్రధాన ఉద్దేశం ఎద్దులను మచ్చిక చేసుకోవడమే కాకుండా.. వాటి బలాన్ని పరీక్షించడం. వ్యవసాయానికి ఉపయోగించే దేశవాళీ జాతి ఎద్దులను సంరక్షించాలనే భావన కూడా ఈ జల్లికట్టులో దాగి ఉంది. ఒకప్పుడు ఈ క్రీడలో గెలిచిన యువకులను సమాజం ఎంతో గౌరవంగా చూసేది. వారి ధైర్యాన్ని, శక్తిని గుర్తించే మార్గంగా జల్లికట్టు నిలిచింది.
జల్లికట్టు ఈనాటి ఆట కాదు. క్రీస్తుపూర్వం 400 నుంచి 100 సంవత్సరాల మధ్య కాలంలోనే ఇది ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. సింధూ లోయ నాగరికత కాలానికి చెందిన ముద్రికల్లో ఎద్దుతో మనిషి పోరాడుతున్న దృశ్యాలు కనిపించడం విశేషం. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మదురై సమీపంలోని గుహల్లో చెక్కిన శిల్పాలు సైతం ఈ సంప్రదాయం ఎంత పురాతనమో తెలియజేస్తున్నాయి.
జల్లికట్టులో పాల్గొనేవారు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. జల్లికట్టుకు కొన్ని రోజుల ముందు నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జల్లికట్టు క్రీడలో పాల్గొనే వాళ్లు నాన్వెజ్ తినకూడదట. దీని కోసం చాలామంది నెల రోజుల ముందే నియమాలు పాటిస్తూ ఉపవాసాలు చేస్తుంటారు. ఇదంతా బహుమతుల కోసమే కాకుండా.. తమ ధైర్యాన్ని నిరూపించుకునే వేదికగా జల్లికట్టను భావిస్తారు. గెలిచిన వారిని గ్రామాల్లో హీరోల మాదిరి గౌరవిస్తారు.
జల్లికట్టు వలన జంతువులు, మనుషులకు ప్రమాదం ఉందన్న కారణంతో గతంలో దీనిపై ప్రముఖ న్యాయస్థానాలు నిషేధాలు, స్టేలు విధించాయి. అయినా సరే దీనిని తమ సంస్కృతిగా భావించిన తమిళనాడు ప్రజలు.. దీని కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. చివరకు చట్టసవరణలతో జల్లికట్టు తిరిగి పొంగల్ వేడుకల్లో భాగమైంది. ప్రతి ఏటా ఈ జల్లికట్టు వలన గాయాల పాలైనా, ప్రాణాలు సైతం పోతున్నా లెక్క చేయకుండా.. మరింత ఉత్సాహంగా జల్లికట్టును నిర్వహిస్తున్నారు.