Gram Panchayat Elections: సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంకు చెందిన గుడితండా గ్రామంలో.. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న జైపాల్ నాయక్ తీసుకున్న వినూత్న నిర్ణయం గ్రామ రాజకీయాలకు కొత్త దిశను చూపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ బాండ్ పేపర్ను తయారు చేసి గ్రామస్తులకు పంపిణీ చేయడం ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నా దగ్గర ప్రస్తుతం ఉన్న ఆస్తికన్నా ఒక్క రూపాయి ఎక్కువ అక్రమంగా సంపాదించానని తేలితే, ఆ ఆస్తిని గ్రామ పంచాయతీ జప్తు చేసుకోవచ్చు అని బాండ్లో స్పష్టంగా పేర్కొంటూ ప్రజలకు నమ్మకాన్ని చాటుతున్నారు. గ్రామంలో లంచాలు, అవినీతికి వ్యతిరేకంగా సర్పంచ్ అభ్యర్థి తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
మరోవేపు నల్గొండ జిల్లా అనుముల పరిధిలోని పేరూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకి రిజర్వ్ కావడంతో పాటు, ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులు ఎస్టీలకు రిజర్వ్ కావడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.
గత మూడు రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. సర్పంచ్ అభ్యర్థితో పాటు ఎనిమిది వార్డులకు కూడా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్టయింది. గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అధిక సంఖ్యలో రిజర్వేషన్లు కేటాయించడం అన్యాయమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయడాన్ని కూడా గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. తాజా జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా పాత డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల తమ గ్రామ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వారు వాపోతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే గత నెల 28న గ్రామస్తులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల్లో పాల్గొనేది లేదని గ్రామస్తులు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.