Indiramma Indlu Scheme: ఇకపై ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రతివారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్దిదారులు వేగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. రామగుండంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం.. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకూ ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు నిధులు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటి స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందజేస్తున్నామన్నారు. ఇకపై ప్రతివారం బిల్లులు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
“ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి వారం నిధులు ఇస్తాం. ఇల్లు ఎంత వరకూ పూర్తైతే అంత వరకూ బిల్లు పెడితే ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తాం. మీరు త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను పాదయాత్రలో చూసిన సమస్యలను పరిష్కరించడానికి ఆనాడే నోట్ బుక్ రాసుకున్నాను. పేదలకు ఇళ్లు లేవని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా రాలేదు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాం” –డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Also Read: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు.. వచ్చే ఏప్రిల్లో మరో విడత: మంత్రి పొంగులేటి