Indiramma Houses Phase 2: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సమీపంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్ నెలలో మరో విడత ఇళ్లు మంజూరు చేస్తామని, రానున్న రెండేళ్లలో మరో రెండు విడతల్లో అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, కులమతాలకు అతీతంగా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు వెచ్చిస్తున్నామని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని వెల్లడించారు.
హుజూర్నగర్లోని 2,160 ఇళ్లను ‘మోడల్ కాలనీ’గా తీర్చిదిద్ది, మార్చి 31 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి లేదా ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్కు సూచించారు. మిగిలిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తే, ఈ నెల 15లోగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2012లో తాను హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలనీ మంజూరైందని, దేవాదాయ శాఖ భూమిని కొనుగోలు చేసి పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. గత పదేళ్లుగా పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోందని చెప్పారు. పాఠశాల, అంగన్వాడీ, హెల్త్ సెంటర్ వంటి అన్ని వసతులతో ఇది దేశంలోనే ఆదర్శవంతమైన కాలనీగా నిలుస్తుందన్నారు. మెరిట్ ఆధారంగానే ఇళ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మఠంపల్లికి రానున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, హౌసింగ్ సెక్రటరీ గౌతమ్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. కేటీఆర్ ఖమ్మం టూర్కి ఉందే, రానున్న రోజుల్లో