Telangana IPS promotions: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ పదోన్నతులు కల్పించింది. 1995, 1996 బ్యాచ్లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో, పోలీసు ఉన్నతాధికారుల స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
పదోన్నతి పొందిన వారిలో 1995 బ్యాచ్కు చెందిన ముగ్గురు అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అదనపు డీజీలుగా సేవలు అందిస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్, స్వాతి లక్రా, వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావులకు డీజీ హోదా కల్పించారు. అలాగే, 1996 బ్యాచ్కు చెందిన చారుసిన్హా, అనిల్ కుమార్, ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వి.సి. సజ్జనార్లకు కూడా డీజీ ర్యాంకులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఐపీఎస్ పే మ్యాట్రిక్స్ రూల్స్ 2016 ప్రకారం, లెవల్ 16 హోదాలో వీరికి ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
అయితే, ఈ అధికారులకు పదోన్నతి లభించినప్పటికీ, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వీరంతా ప్రస్తుతం ఏ బాధ్యతల్లో ఉన్నారో అదే స్థానాల్లో కొనసాగుతారనిప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల విధుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా, ఉన్నత హోదాలో వారు తమ సేవలను కొనసాగించనున్నారు.