IPS Transfers: తెలంగాణలో కొద్ది రోజల్లో పంచాయితీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కే. రామకృష్ణ రావు జీవో జారీ చేశారు.
పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీల్లో భాగంగా దేవేంద్ర సింగ్ చౌహాన్ను అడిషనల్ డీజీపీ (పర్సనల్)గా నియమిస్తూనే, మల్టీ జోన్–II బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. అలాగే జాయింట్ సీపీగా ఉన్న పరిమళ హనా నూతన్ జాకబ్ను సీఐడీ డీఐజీగా బదిలీ చేశారు. హైదరాబాద్ నగరంలో కీలకమైన సౌత్ జోన్ డీసీపీగా ఖరే కిరణ్ ప్రభాకర్ను నియమించగా, ఇప్పటివరకు అక్కడ ఉన్న స్నేహ మెహ్రాను వికారాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభవ్ రఘునాథ్కు బాధ్యతలు అప్పగించారు.
జిల్లాల వారీగా చూస్తే ఎస్పీ స్థాయి అధికారుల్లోనూ అనేక మార్పులు జరిగాయి. ములుగు ఎస్పీగా కేకన్ సుధీర్ రామ్నాథ్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్, నాగర్కర్నూల్ ఎస్పీగా డాక్టర్ పాటిల్ సంగ్రామ్సింగ్, మహబూబాబాద్ ఎస్పీగా డాక్టర్ శబరీష్ పి , కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నితికా పంత్, నియమితులయ్యారు. అలాగే వెయిటింగ్లో ఉన్న డి. సునీతను వనపర్తి ఎస్పీగా నియమించగా, ఎస్. శ్రీనివాస్ను ట్రాన్స్కో ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నారాయణ రెడ్డిని మహేశ్వరం జోన్ డీసీపీగా, సి హెచ్ శ్రీధర్ను మల్కాజిగిరి డీసీపీగా నియమించారు. గ్రేహౌండ్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలోనూ పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.