Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252పై వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ఈ జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) ప్రతినిధులు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును హైదరాబాద్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న ఈ జీవోపై అసెంబ్లీలో తప్పకుండా ప్రశ్నిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జీవో 252 వల్ల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను.. హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో అమలులో ఉన్న జీవో 239 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేల మందికి అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యేవని, కానీ కొత్త జీవో వల్ల ఆ సంఖ్యను 13 వేలకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. దీని వల్ల సుమారు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను గౌరవించాల్సింది పోయి.. వారిని అణచివేసేలా కొత్త నిబంధనలు తేవడం దుర్మార్గం అని హరీశ్రావు అన్నారు.
డెస్క్ జర్నలిస్టులకు వేరు రిపోర్టర్లకు వేరు అంటూ.. రెండు కార్డుల విధానం తీసుకురావడం జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టడమే అని హరీశ్ రావు ఆరోపించారు. వార్తను ప్రజల వరకు చేర్చడంలో డెస్క్ జర్నలిస్టుల పాత్ర కూడా కీలకం. అలాంటి వారికి అక్రిడిటేషన్ ఇవ్వకుండా కేవలం గుర్తింపు కార్డు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవడం వారిని కించపరచడమే అని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా.. 23 వేల మందికి అక్రిడిటేషన్లు ఇచ్చి గౌరవించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 13 వేలకు కుదించాలని చూడటం అంటే.. దాదాపు 10 వేల మంది జర్నలిస్టులకు అన్యాయం చేయడమే. జర్నలిస్టుల సంఖ్యను తగ్గించి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఆరోపించారు.
కొత్త జీవో వల్ల జర్నలిస్టులు హెల్త్ కార్డులు, బస్ పాస్ సౌకర్యాలను కోల్పోయే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల, వారి ప్రయాణ సౌకర్యాల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయం. గతంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించి, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ ఇప్పుడు ఆ ప్రీమియం చెల్లించడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తూ అన్యాయం చేస్తుందని హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది. అందుకే కేసీఆర్ జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు.
జర్నలిస్టులకు అన్యాయం చేసే ఈ జీవోపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో.. ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తానని హరీష్ రావు యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జీవో 252 సవరణ కోసం TUWJ చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, ప్రభుత్వానికి తగు సూచనలు చేసి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
Also Read: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్
హరీష్ రావు గారిని కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, కోశాధికారి పి.యోగనంద్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్షులు రాకేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ తదితరులు ఉన్నారు.