Telangana Education: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 39 కొత్త కోర్సులను రూపొందించామని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కలలను నిజం చేసేలా విజన్ 2047 లక్ష్యంతో వచ్చే కొత్త విద్యాసంవత్సరం నుంచే ఆధునిక సాంకేతికతతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. టీ శాట్ నెట్ వేదికపై యూజీ, పీజీ కోర్సుల్లో కొత్త, ఎమెర్జింగ్ కోర్సులపై అవగాహన కల్పించారు. డిగ్రీ స్టూడెంట్ల కోసం19 కోర్సులు, పీజీ విద్యార్థుల కోసం మరో 10 కోర్సులను ఆచరణలోకి తీసుకురాబోతున్నామన్నారు.
వీటితో పాటు చదువుకుంటూనే పని నేర్చుకునేలా అప్రెంటిస్షిప్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కింద మరో 10 కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు స్పష్టం చేశారు. వచ్చే కొన్నేళ్లలో రాష్ట్రంలో ఉపాధి విప్లవం రాబోతోందన్నారు. 2030 సంవత్సరం నాటికి పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో తెలంగాణలోని వివిధ రంగాల్లో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని, దీని ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేశారు. ఆ ఉద్యోగాలను సాధించేలా తెలంగాణ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే కౌన్సిల్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాలేజీల్లో క్వాలిటీ టీచింగ్, రీసెర్చ్, మానిటరింగ్ తప్పనిసరని హెచ్చరించారు.
Also Read: Jeevan Reddy: కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో కీలక పోస్ట్..?
అనంతరం మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం మాట్లాడుతూ.. ఎన్ని ఉన్నత చదువులు చదివినా, నైపుణ్యం లేని చదువుతో ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నైపుణ్యం లేకుంటే ఉపాధి లభించడం కష్టమన్నారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని, అందుకు తగ్గట్టుగా వర్సిటీలకు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. కొత్త కోర్సులు నిర్వహించే కాలేజీలు, యూనివర్సిటీలు కచ్చితంగా ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని టీజీసీహెచ్ఈ సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ సూచించారు. కొత్త కోర్సులపై కౌన్సిల్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.
Also Read: Natural Farming: రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి ఘనంగా రైతు మహోత్సవాలు: మంత్రి తుమ్మల!