Natural Farming: స్వేచ్ఛ బ్యూరో: జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయ ప్రాంగణం నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ 86వ ఎపిసోడ్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులకు ప్రత్యేక ‘ఫార్మర్ కిట్లను’ అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయమే శ్రీరామరక్ష అన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకంతో మానవ ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భూగర్భ జలాలు వాతావరణం కలుషితమవుతున్న తరుణంలో, మన పూర్వీకులు ఆచరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులే రైతులకు, సమాజానికి క్షేమకరమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లను గుర్తించి, ఒక్కో క్లస్టర్ నుండి 125 మంది చొప్పున మొత్తం 61,125 మంది రైతులను ఈ పథకం కోసం ఎంపిక చేసి ఫార్మర్ కిట్లను అందజేశారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న ‘రైతు మహోత్సవ’ కార్యక్రమానికి రైతులు భారీగా తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. 150కి పైగా స్టాల్స్, శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉంటుందన్నారు. 22న యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల జమ కార్యక్రమంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: Romantic Drama OTT: ఇన్సూరెన్స్ కోసం నకిలీ పెళ్ళి… కట్ చేస్తే అదిరిపోయే లవ్ స్టోరీ…
రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ అధిక ఆదాయాన్ని గడించాలని మంత్రి ఆకాంక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమంలో లక్ష్యానికి మించి 110% నమోదు చేసి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వం ద్వారా 422.64 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకం పొందడంలో కీలక పాత్ర పోషించిన వ్యవసాయ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, వ్యవసాయ సంచాలకుడు బి. గోపి, అధికారులు పాల్గొన్నారు.
Also Read: Sridhar Babu: నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు: మంత్రి శ్రీధర్ బాబు