Mahua Project: స్వేచ్ఛ బ్యూరో: గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ‘మహువా ఫ్లవర్ ప్రాజెక్ట్ అమలు’పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి తో కలిసి ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.
మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…గిరిజన ఆదివాసీ మహిళలు, రైతులు, యువత, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.అడవుల్లో సహజసిద్ధంగా లభించే ఇప్ప పువ్వు గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ప్రస్తుతం ఇప్ప పువ్వును కేవలం సంప్రదాయ వినియోగానికి మాత్రమే పరిమితం కాకుండా, ఆహార ఉత్పత్తులు, ఔషధ వినియోగాలు, విలువ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
సమగ్ర విధానాలు అమలు చేస్తాం..
గిరిజన ప్రాంతాల్లో శాస్త్రీయ సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసి గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.ప్రత్యేకంగా గిరిజన మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సమాఖ్యలను ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం చేసి గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అటవీ సంపదపై గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ, అదే సమయంలో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సమగ్ర విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ ..
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ …గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే ఇప్ప పువ్వు కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే కాకుండా గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా మారే సామర్థ్యం కలిగి ఉందన్నారు.ఇప్ప పువ్వు నుండి లడ్డూలు, నాచురల్ హెల్త్ ఫుడ్స్, సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేయవచ్చని, ఇప్ప గింజల నుండి నూనె తయారీకి కూడా విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్ప ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ వినియోగంలోకి తీసుకువస్తే గిరిజన ప్రాంతాల్లో చిన్న స్థాయి పరిశ్రమలు ఏర్పడి మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ట్రైబల్ నాచురల్ ఫుడ్ బ్రాండ్స్
ఇప్ప పువ్వుతో పోషకాహార పదార్థాలు, పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్, మిల్లెట్ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్, హర్బల్ టీలు, నాచురల్ స్వీటెనర్లు తయారు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి ‘ట్రైబల్ నాచురల్ ఫుడ్ బ్రాండ్స్’ రూపంలో మార్కెట్లోకి తీసుకురావాలని సూచించారు.గిరిజన మహిళల సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తే ప్రపంచ మార్కెట్లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని సీతక్కపేర్కొన్నారు. ప్రతి గిరిజన గ్రామంలో ఇప్ప పువ్వు సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్కు మినీ యూనిట్లు ఏర్పాటు చేయాలని, యువతను స్టార్టప్ రంగంలో ప్రోత్సహించాలని సూచించారు.
అంతర్జాతీయ లక్ష్యంగా..
ఇప్ప పువ్వు ఆధారిత ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, ఈ-కామర్స్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్ను లక్ష్యంగా చేసుకోవాలని తెలిపారు. గిరిజన మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, ప్రభుత్వ సబ్సిడీలు, స్వయం ఉపాధి పథకాలను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి , మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో , గిరిజన ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ ,మురళి నాయక్ పాటు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, భద్రాచలం పి.ఓ రాహుల్, ఉట్నూర్ పి.ఓ మంద మకరందు, ఏటూరునాగారం పి.ఓ లెనిన్ వత్సాల్ టొప్పో తదితరులు పాల్గొన్నారు.
Also Read: నీట్ 2026 పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్.. సూత్రధారిని గుర్తించిన సీబీఐ!