NEET UG 2026: నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ కీలక మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణానికి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తరఫున నీట్ పరీక్షల ప్రక్రియలో పాలుపంచుకున్న కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. పరీక్షకు ముందే కులకర్ణి వద్దకు ప్రశ్న పత్రాలు చేరాయని, ఆ తర్వాతే లీకేజీ నెట్వర్క్ నడిచిందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కుట్రలో కులకర్ణికి మనీషా వాఘ్మారే అనే మహిళా నిందితురాలు సహకరించింది. 2026 ఏప్రిల్ చివరి వారంలోనే వీరిద్దరూ కలిసి లీక్ చేసిన పేపర్తో రంగంలోకి దిగారు. మనీషా సాయంతో భారీగా విద్యార్థులను సమీకరించిన కులకర్ణి, పూణేలోని తన స్వగృహంలోనే వారందరికీ ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించాడు. ఈ క్లాసుల్లో నీట్ పరీక్షలో రాబోయే ప్రశ్నలను, వాటి ఆప్షన్లను, సరైన సమాధానాలతో సహా బోర్డుపై రాసి విద్యార్థులకు ముందే నేర్పించాడు. విద్యార్థులు తమ నోట్బుక్లలో చేతితో రాసుకున్న ఆ ప్రశ్నలు, మే 3న జరిగిన అసలు నీట్ పరీక్ష పేపర్తో వంద శాతం సరిపోలడం గమనార్హం. ఈ ఆధారాలన్నింటినీ సేకరించిన సీబీఐ.. మే 14న మనీషా వాఘ్మారేను అరెస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ కేసులో దేశవ్యాప్తంగా సీబీఐ వేట ముమ్మరం చేసింది. నిన్నటి వరకు జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహల్యానగర్లలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురిని ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, లోతైన విచారణ కోసం కోర్టు వారికి 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. నిన్న అరెస్ట్ అయిన మిగిలిన ఇద్దరు నిందితులను ట్రాన్సిట్ రిమాండ్ నిమిత్తం పూణే కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు తదుపరి విచారణ కోసం వారిని ఢిల్లీ కోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మున్ముందు ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ కోచ్లో చెలరేగిన మంటలు!