Police Website Hacked: తెలంగాణలో ప్రభుత్వ వెబ్సైట్లకు హ్యాకింగ్ బెడద దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక పోలీస్ కమిషనరేట్లకు చెందిన వెబ్సైట్లు హ్యాకింగ్కు గురికావడం భద్రతాపరంగా తీవ్ర పరిణామాలకు దారి తీసే అంశంగా మారింది. గత 10 రోజులుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ లకు చెందిన అధికారిక వెబ్సైట్లు పూర్తిగా పనిచేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
సాధారణంగా ప్రజలకు కీలక సమాచారాన్ని అందించే ఈ వెబ్సైట్లలో ఫిర్యాదుల నమోదు, ట్రాఫిక్ చలాన్లు, అత్యవసర సంప్రదింపు వివరాలు, ప్రజల కోసం రూపొందించిన వివిధ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ సైట్లను ఓపెన్ చేస్తే, అందులోని లింకులు అనూహ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు, అనుమానాస్పద గేమింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, ప్రణాళికాబద్ధమైన సైబర్ దాడి అని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రాగానే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సైబర్ దాడులు మరింత విస్తరించకుండా నిరోధించేందుకు రాష్ట్ర ఐటీ విభాగం వెంటనే చర్యలు చేపట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా సంబంధిత సర్వర్లను తాత్కాలికంగా డౌన్ చేయాలని తెలంగాణ ఐటీ విభాగం ఆదేశించింది. దీంతో సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకుండా నిలిచిపోయాయి. ఈ చర్య వల్ల హ్యాకర్లు మరింత సమాచారం దోచుకునే అవకాశం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ హ్యాకింగ్ ఘటనపై రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ మాఫియాలతో సంబంధం ఉన్న అంతర్జాతీయ ముఠాలే ఈ దాడికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వెబ్సైట్ల ట్రాఫిక్ను తమ అక్రమ వెబ్సైట్లకు మళ్లించడం ద్వారా.. కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
హ్యాకర్లు ప్రభుత్వ వెబ్సైట్లలోకి ఎలా ప్రవేశించగలిగారన్న అంశంపైనా అధికారులు ఫోరెన్సిక్ స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. సైట్లలోని సెక్యూరిటీ పాచ్లు అప్డేట్ కాలేదా? ఫైర్వాల్లో లోపాలున్నాయా? లేదా ఏదైనా లోపలి వ్యక్తి ద్వారా లాగిన్ వివరాలు లీక్ అయ్యాయా? వంటి అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సర్వర్ లాగ్స్, ఐపీ అడ్రెసులు, అనుమానాస్పద యాక్సెస్లను సేకరించినట్లు సమాచారం.
Also Read: రూ.73 లక్షలతో సర్పంచ్ అవ్వాలనుకున్న ఓ అభ్యర్థికి ట్విస్ట్.. ఏమైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణలోని ఇతర ప్రభుత్వ విభాగాల వెబ్సైట్లపై కూడా భద్రతా సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ సైట్లన్నింటిలోనూ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని, పాత సాఫ్ట్వేర్, బలహీనమైన పాస్వర్డ్ వ్యవస్థలను వెంటనే తొలగించాలని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే డిడీఓఎస్ దాడులను అడ్డుకునేందుకు అదనపు సైబర్ భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతం చేశారు.