Nalgonda News: నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. ఊరికి సర్పంచ్ కావాలని ఆశించిన అభ్యర్థి సమీనా ఖాసిం తీసుకున్న నిర్ణయం మొదట చర్చనీయాంశమై, చివరికి ఆమె ఆశలకు బ్రేక్ వేసింది. గ్రామంలో ఎన్నిక జరగకుండా, ఏకగ్రీవం కోసం ఈ పదవిని ఏకంగా రూ.73 లక్షలకు వేలం పాట పాడి గెలుచుకుంది సమీనా ఖాసిం. ఈ మొత్తాన్ని గ్రామంలో ఆలయాల నిర్మాణానికి ఉపయోగిస్తానని హామీ ఇచ్చింది.
గ్రామంలో సర్పంచ్ పదవికి ముందుగా నామినేషన్లు వేసిన ఇతర అభ్యర్థులు, ఈ వేలం ఒప్పందానికి అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. దీనితో వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే, సమీనా ఖాసిం ఏకగ్రీవంగా సర్పంచ్ అవుతుందని అంతా భావించారు. అయితే, గ్రామ ఎన్నిక ప్రక్రియను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పదవిని వేలం వేయడాన్ని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఈ విషయంపై నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వేలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
వేలం ఒప్పందం ప్రకారం ముందుగా నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు విషయం తెలుసుకున్న మిగిలిన అభ్యర్థులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో కొనసాగాలని నిశ్చయించుకున్నారు. డబ్బులు వెచ్చించి సర్పంచ్ పదవి దక్కించుకోవాలని భావించిన సమీనా ఖాసిం ఆశలు ఈ ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఆవిరయ్యాయి.
ఫలితంగా, బంగారిగడ్డ గ్రామ పంచాయతీకి ఎన్నిక తప్పనిసరైంది. ఏకగ్రీవంగా గెలుపొందాలని సమీనా ఖాసిం అనుకున్నప్పటికీ, ఈ తాజా పరిణామం ఆమెను చివరిరోజు పోటీలోకి దిగాల్సిన పరిస్థితిని కల్పించింది. రూ.73 లక్షల భారీ మొత్తం ఆశ చూపి సర్పంచ్ కావాలనుకున్న సమీనా ఖాసిం ప్రయత్నానికి బ్రేక్ పడింది. ప్రస్తుతానికి, ఆ గ్రామంలో పోలింగ్ జరగడం ఖాయమైంది. ఈ ఘటన ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది. ఈ వేలం పాట అంశంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
ALSO READ: Vijayawada: విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన బాధితులు