TGSPDCL: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో విద్యుత్ ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ ఘాతాలకు బలవుతున్న వారి సంఖ్య దాదాపు రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2025-26లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు కావడం విద్యుత్ శాఖ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.
కేవలం కాగితాలకే పరిమితమవుతున్న రక్షణ చర్యలు, అధికారుల కంటితుడుపు సదస్సులపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోయేలా(రిలే ప్రొటెక్షన్ సిస్టమ్స్) అప్గ్రేడ్ చేసినట్లు సంస్థ చెబుతున్నా, అవి పని చేయకపోవడం వల్లనే రహదారులపై ప్రాణాలు పోతున్నాయి. అలాగే పండగలు, ఊరేగింపుల సమయంలో రోడ్లపై తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో నేలకొరిగిన స్తంభాలు, తుప్పు పట్టిన ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు లేకపోవడం పశువుల మరణాలకు కారణమవుతోంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 30 మంది విద్యుత్ ప్రమాదాల వల్ల మరణించారు. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6 నెలల్లోనే మరణాల సంఖ్య 53కు చేరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గాయాలపాలైన బాధితులు 25 మంది ఉంటే 2025-26లో ఈ సంఖ్య 16కు తగ్గింది. ఇకపోతే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 111 మూగ జీవాలు బలైతే.. 2025-26లో కేవలం 6 నెలల వ్యవధిలోనే 146 పశువులు మృత్యువాతపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో లైన్లు తెగిపడటం, ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ లేకపోవడం వల్ల మొత్తం 83 మంది మరణించగా.. పశువుల మరణాలు 257 నమోదయ్యాయి. గాయాలపాలైన వారి సంఖ్య 41గా ఉంది.
Also Read: Graduate Elections: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఆ రెండు స్థానాలపై నేతల ఫోకస్..!
ప్రమాదాల తీవ్రత పెరగడంతో సంస్థపై ఆర్థిక భారం కూడా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్లకు పైగానే ఎస్పీడీసీఎల్ పరిహారం అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా 2025-26లో మరణాల సంఖ్య పెరగడం, దానికి తోడు ఈఆర్సీ కూడా నష్టపరిహారంగా ఇచ్చే మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచాలని డిస్కంలను ఆదేశించడంతో దాదాపు రూ.18 కోట్లకు పైగానే పరిహారం అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంటే మొత్తంగా గత ఏడాదిన్నర కాలంలో విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు ఎస్పీడీసీఎల్ ఏకంగా రూ.25 కోట్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. పరిహారం ఇవ్వడం ద్వారా బాధ్యత తీరిపోదని, అసలు ప్రమాదాలు జరగకుండా చూడటమే ముఖ్యమని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా ప్రమాదరహిత విద్యుత్ సేవలు, ఉద్యోగుల భద్రత, ఆధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానాల ప్రోత్సాహం లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ సురక్ష 2026-సేఫ్టీ ఎక్స్పో, వర్క్షాప్ ను శుక్రవారం నిర్వహించనుంది. విద్యుత్ భద్రతకు సంబంధించిన ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిష్కారాలు, భద్రతా ఉత్పత్తుల ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అయితే.. ఈ వర్క్షాప్ నిర్వహణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా.. క్షేత్రస్థాయిలో వేలాడుతున్న కరెంట్ తీగలు, విరిగిపోయిన స్తంభాలు, రక్షణ కవచాలు లేని ట్రాన్స్ఫార్మర్లను సరిచేయడంలో విఫలమవ్వడంపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో లైన్మెన్లు, కార్మికులకు ఆధునిక సేఫ్టీ కిట్లు అందించాలని, పాతబడిన విద్యుత్ లైన్లను, ప్రమాదకరంగా మారిన స్తంభాలను తక్షణమే పునరుద్ధరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వాడకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ప్రాణాలు పోయిన తర్వాత పరిహారాలు ప్రకటించడం కంటే, ముందే ప్రమాదాలను అరికట్టేలా ఎస్పీడీసీఎల్ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా సంస్థ ఇలాంటి విద్యుత్ ప్రమాదాలను నివారిస్తుందా? లేదా అనేది చూడాలి.
Also Read: Singareni Mines: చరిత్రలోనే తొలిసారిగా సింగరేణి భారీ రికార్డు.. ఒకే సారి 5-స్టార్ రేటింగ్..?