Investment Fraud: స్వేచ్చ బ్యూరో: అధిక వడ్డీ ఆశ చూపించి తెలిసిన వారి నుంచి దాదాపు 50కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యాపారి ఉదంతమిది. డబ్బు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి వస్తుండటంతో పక్కాగా చేసుకున్న ప్లాన్ ప్రకారం భార్యతో కలిసి విహారయాత్ర అని చెప్పి స్విట్జర్లాండ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత భార్యాభర్తలు ఇద్దరూ తమ ఫోన్లను స్విచాఫ్ చేసి పెట్టుకున్నారు. కాగా, స్విట్జర్లాండ్ వెళ్లిన తల్లిదండ్రుల జాడ తెలియటం లేదంటూ వారి కూతురు చర్లపల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుతో బాగోతం అంతా బయటపడింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కుషాయిగూడ చక్రపురం ప్రాంతంలోని భగవాన్ కాలనీకి చెందిన స్వప్న, చంద్రశేఖర్ భార్యాభర్తలు. చంద్రశేఖర్ శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేర ముప్పయి సంవత్సరాలుగా స్థానికంగా సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. అదే సమయంలో ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలతో కొంతకాలం క్రితం చంద్రశేఖర్ మోసాలకు తెర లేపాడు. తన తండ్రి వైద్య ఖర్చులకని, కూతురి పెళ్లికోసమని, కొత్త ఇంటి నిర్మాణానికని, జీఎస్టీ చెల్లించి క్లెయిమ్ లు తీసుకోవాల్సి ఉందని చెప్పి పలువురి నుంచి అప్పులు తీసుకున్నాడు. తనకు ఫైనాన్స్ చేస్తే ఎక్కువ వడ్డీ ఇస్తానని నమ్మించాడు. ఇలా పలువురి నుంచి 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు. అయితే, చెప్పినట్టుగా ఎవ్వరికీ వడ్డీ చెల్లించలేదు. తీసుకున్న అప్పు తీర్చలేదు. దాంతో అతనికి ఫైనాన్స్ చేసిన వారిలో కొందరు తమ డబ్బు తమకు ఇవ్వాలంటూ ఒత్తిడి తేవటం మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో అప్పు ఎగ్గొట్టటానికి చంద్రశేఖర్ దంపతులు పక్కాగా ప్లాన్ చేశారు. దాని ప్రకారం జాలీ ట్రిప్ కోసం స్విట్జరాండ్ వెళుతున్నట్టు అందరితో చెప్పారు. తన ఇద్దరు కూతుళ్లను చంద్రశేఖర్ తన తమ్ముని ఇంట్లో దిగబెట్టాడు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని గతనెల 22న చంద్రశేఖర్, స్వప్న స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లిన తరువాత కొన్నిరోజులపాటు కూతుళ్లు, తమ్మునితో మాట్లాడారు. ఆ తరువాత ఫోన్లు స్విచాఫ్ చేసి పెట్టుకున్నారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్విచాఫ్ అన్న సమాధానం వస్తుండటంతో చంద్రశేఖర్ దంపతుల కూతురు శ్రేయ చర్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: Train Accident: జస్ట్ మిస్.. లేదంటే.. వైజాక్ టూ చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైళుకు తప్పిన భారీ ప్రమాదం!
ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే చంద్రశేఖర్ చేతుల్లో మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. చంద్రశేఖర్ తమను 50కోట్ల రూపాయలకు పైగా మోసం చేశాడని తెలియచేశారు. గతనెల 30న మల్కాజిగిరి కమిషనర్ సుమతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్టు చెప్పారు. దాంతో అసలు బాగోతం బయటపడింది.
వెలుగు చూసిన ఈ అంశాల నేపథ్యంలో కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చంద్రశేఖర్, స్వప్నచివరిసారిగా ఎక్కడ ఉన్నారు? అసలు స్విట్జర్లాండ్కు వెళ్లారా? వెళితే వారి విమాన ప్రయాణ వివరాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఏ విధంగా జరిగాయి? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే స్విట్జర్లాండ్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుని చంద్రశేఖర్ దంపతులను నగరానికి తీసుకురావడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also read: Singareni Mines: చరిత్రలోనే తొలిసారిగా సింగరేణి భారీ రికార్డు.. ఒకే సారి 5-స్టార్ రేటింగ్..?