Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఉద్యమ కాలం నాటి నుంచి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే, తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ లైన్కు భిన్నంగా ఆయన మాట్లాడిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
పార్టీ లైన్ వర్సెస్ ఈటల వాయిస్
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద అవినీతి కూపమని, దీనివల్ల పైసా ఉపయోగం లేదని తెలంగాణ బీజేపీ మొదటి నుంచి గట్టిగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీ పెద్దల నుంచి గల్లీ లీడర్ల వరకు ఇదే మాటను నమ్ముతున్నారు. కానీ, ఈటల రాజేందర్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. కాళేశ్వరం వల్ల తెలంగాణకు కొంత మేలు జరిగిందనే కోణంలో ఆయన మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకే అంశంపై పార్టీకి, కీలక నేతకు మధ్య పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంతో క్షేత్రస్థాయిలో కమలం కార్యకర్తలు తీవ్ర అయోమయంలో పడ్డారు.
Also Read: అయోధ్య హుండీ లెక్కింపు సిబ్బంది రాజీనామా.. వెలుగులోకి సంచలన విషయాలు!
సొంత ఇమేజ్ కోసమేనా?
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈటల పూర్తిగా బీజేపీ రంగును పులుముకోవడానికి ఇష్టపడట్లేదు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తనకున్న పాత ఇమేజ్ను కాపాడుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ‘తెలంగాణ ఫస్ట్… తర్వాతే పార్టీ’ అనే నినాదాన్ని ఆయన ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో చేరినప్పటి నుంచి తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత, గౌరవం దక్కలేదనే అసంతృప్తి ఈటలలో ఎప్పటి నుంచో ఉందనేది బహిరంగ రహస్యం.
భవిష్యత్తు వ్యూహం ఏంటి?
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. ఈటల తన భవిష్యత్తు కోసం కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఆయన నోట కాళేశ్వరంపై సానుకూల మాటలు రావడంతో.. ఆయన మళ్లీ గులాబీ గూటికి చేరతారా? లేక కొత్త దారి వెతుక్కుంటారా? అనే చర్చ జోరందుకుంది.
మరి ఈటల పాడిన ఈ సరికొత్త రాగంపై ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో, ఈ పరిణామాలు ఆయన్ను ఏ తీరానికి చేరుస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీ పర్యాటకులు.. రంగంలోకి దిగిన నారా లోకేష్!