Sarpanch Manifesto: మెదక్ జిల్లాలో బాండు పేపర్ మేనిఫెస్టో చర్చనీయాంశం అయింది. హవేలీ ఘన్పూర్ మండలం రాజుపేట తండా కాప్రాయిపల్లి గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కుక్కల మౌనిక వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా 100 రూపాయల బాండ్ పేపర్పై 15 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ముద్రించారు. ఈ హామీలలో ఆడపిల్ల పుడితే రూ.2000, తీజ్ పండుగకు రూ.2000, ముదిరాజ్ బోనాల పండుగకు రూ.8000, ఎల్లమ్మ బోనాల పండుగకు రూ.3000 ఆర్థిక సహాయం చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం ఆపద్బంధు పథకం కింద 5000 సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ హామీలను అమలు చేయకుంటే జిల్లా కలెక్టర్ లేదా న్యాయస్థానం ద్వారా తనను తొలగించవచ్చంటూ బాండ్ పేపర్పై రాసివ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ మేనిఫెస్టో తయారు చేశానని.. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని మౌనిక గ్రామస్తులను వేడుకున్నారు.
పల్లెపోరులో హామీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పంచాయతీ రాజకీయాలు హామీల కారణంగా వేడెక్కుతున్నాయి. ఏకంగా ఓ అభ్యర్థి 22 హామీల మేనిఫెస్టోను.. వంద రూపాయల బాండ్ పత్రంపై రాసి ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామపంచాయతీలో పోటీ చేస్తున్నారు ఆంజనేయులు. గ్రామాభివృద్ధి కోసం 22 హామీలతో కూడిన మేనిఫెస్టోను బాండు పత్రంపై రూపొందించారు. ఒకవేళ హామీలు నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించడం సంచలనం సృష్టించింది.
పొలాలు ట్రాక్టర్ ద్వారా దున్నేందుకు గంటలకు రూ.600, వెయ్యి చొప్పున మాత్రమే ఛార్జ్ చేస్తానన్నారు. గ్రామానికి అంబులెన్స్, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు అంతేకాక చర్చి, టెంపుల్ దగ్గర బోరు మోటార్, కుళాయిల వసతి, కట్టమీద టెంపుల్కు వెళ్లడానికి మెట్లు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ లో స్పష్టం చేశారు. లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత హెల్మెట్ పంపిణీ చేస్తానన్నారు. బీసీ శ్మశాన వాటికకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
వితంతు మహిళల ఇంటి నిర్మాణం కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, కల్యాణ కానుక, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించడం లాంటి సంక్షేమ కార్యక్రమాలను మేనిఫెస్టోలో చేర్చారు. గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి, ఇంకుడు గుంత, మరుగుదొడ్డితో పాటు.. వృద్ధులకు ఉచిత కంటి ఆపరేషన్లు, పరీక్షలు చేయిస్తానన్నారు. ఇలా అన్ని ఇన్ని కాకుండా 22 హామీల మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్పై రాశారు ఆంజనేయులు. ప్రతి సంవత్సరం ఐదు హామీలను నెరవేరుస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. స్థానిక ఎన్నికల ఫలితాలపై ఇది కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
హామీలు ప్రకటించిన సల్కాపురం సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులుకు బెదిరింపులు మొదలయ్యాయి. నామినేషన్ను ఉపసంహరించుకోకపోతే చంపేస్తామంటూ ప్రత్యర్థులు తీవ్రంగా హెచ్చరించినట్లు ఆంజనేయులు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా, తనపై దాడికి ప్రయత్నించి.. బూతులు తిట్టారని ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆంజనేయులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.