Amaravati: అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారా?.. నిన్నటి వరకు…అమరావతి అంటే నారాయణ.. నారాయణ అంటే అమరావతి అనే విధంగా ఉన్న పరిస్థితిని చంద్రబాబు మార్చాలనుకుంటున్నారా ? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను రాజధాని అంశంలో రంగంలోకి దింపడం వెనుక ఆంతర్యం ఏమటి ? అమరావతి రైతుల విషయంలో పెమ్మసాని దూకుడు.. ప్రభుత్వానికి లాభమా..? నష్టమా..?
ఆంధ్రుల కలల రాజధానిగా.. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్ధాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 29 గ్రామాల్లో 33 వేల ఎకరాలు సమీకరించి.. అమరావతి పనులను జెట్ స్పీడ్తో ముందుకు తీసుకువెళుతున్నారు. అంతేకాదు అమరావతి అంటే ఓ సాదాసీదా నగరం కాకూడదని.. విశ్వ నగరంగా వ్యాపించాలంటే మరింత భూమి కావాలంటూ .. రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయ్యారు. అయితే అమరావతి రైతులను డీల్ చేసేందుకు సీఎం చంద్రబాబు కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. అందులో భాగంగానే కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను రంగంలోకి దింపారు.
వాస్తవానికి ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన దగ్గర నుండి.. మొన్నటి వరకు అన్నీ వ్యవహారాల్లో మంత్రి నారాయణ అత్యంత కీలక పాత్ర పోషించారు. 2014 నవంబర్లో ల్యాండ్ పూలింగ్ ప్రకటించిన దగ్గర నుండి రైతులతో మమేకమవుతూ… భూములు తీసుకోవడం, తిరిగి వాళ్లకు భూములు ఇవ్వడం.. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమంలో వాళ్లను భాగస్వామ్యం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ చొరవ తీసుకోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారం విషయంలో మంత్రి నారాయణ వ్యవహార శైలితో అమరావతి అన్నదాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయనవల్లే చాలా సమస్యలు పెండింగ్లో ఉండిపోతున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల రాజధాని రైతుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో ఈ ఆగ్రహజ్వాలలకు ఆదిలోనే ముగింపు పలకాలని భావించిన సీఎం చంద్రబాబు…కేంద్రమంత్రి పెమ్మసానిని రంగంలోకి దింపారని టాక్.
అమరావతి కోసం భూములిచ్చిన రైతులు గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైసీపీ హయాంలో తమ గోడు ఎవరికి వెళ్ళబోసుకోవాలో కూడా తెలియక బిక్కుబిక్కు మంటూ గడిపారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారట. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా..సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని..పలుమార్లు మంత్రి నారాయణకు అనేకసార్లు రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదట. ప్లాట్లు కేటాయింపుగాని, మౌలిక సదుపాయాల కల్పన విషయంలోగాని ఎలాంటి ముందడుగు పడట్లేదని ఆవేదనతో ఉన్నారట. ఒక దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు కార్యచరణకు సిద్ధమయ్యారు. ఈ దెబ్బతో అలర్టయిన సీఎం చంద్రబాబు..స్థానిక ఎంపీగా ఉన్న పెమ్మసానికి త్రిసభ్య కమిటీలో చోటు కల్పించారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని బాధ్యతల నుంచి మంత్రి నారాయణను మెల్లమెల్లగా తప్పించి.. పెమ్మసానికే పూర్తి బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారని టాక్.
అమరావతి త్రిసభ్య కమిటీలో చోటు దక్కించుకున్నప్పటి నుంచి కేంద్రమంత్రి పెమ్మసాని తన దూకుడును చూపిస్తున్నారట. వరుసగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని..వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇస్తున్నారట. రైతులు, అధికారులను సమన్వయం చేసే విధంగా కార్యచరణ పెట్టుకున్నారట.
అమరావతి విషయంలో సడన్గా పెమ్మసానిని రంగంలో దింపడం వెనుక వ్యూహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అమరావతి రైతుల విషయంలో సామాజిక సమీకరణాలతోనే పెమ్మసానికి ఆ బాధ్యతలు అప్పగించినట్లు టాక్. పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎంపీ కావడంతో పాటు.. సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందనే భావనలో సీఎం చంద్రబాబు ..ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమరావతి రైతుల విషయంలో చిన్న ఇష్యూ జరిగినా .. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. రైతులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్నమాట మాట్లాడినా… రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలో.. వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత కూడా పెమ్మసానికే చంద్రబాబు అప్పగించినట్లు టాక్. దానిలో భాగంగా జేఏసీ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ… ఎవరు విమర్శలు చేయకుండా సమస్యలు పరిష్కారం చేయాలని పెమ్మసానికి సీఎం సూచించారట.
మరోవైపు అమరావతి రెండో విడత భూ సమీకరణ విషయంలో కూడా… పెమ్మసానికే సీఎం చంద్రబాబు ఎక్కువ బాధ్యతలు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తుంది. రైతులెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, సాఫీగా భూములు ఇచ్చేలా చూడాలని పెమ్మసానిని చంద్రబాబు ఆదేశించారట. బుజ్జగించాల్సిన చోట బుజ్జగించడం.. హెచ్చరించాల్సిన చోట హెచ్చరించడం అనే విధానంలో ముందుకు వెళ్లాలని పెమ్మసానికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి బాధ్యతలు ఇవ్వడం లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందా అనే చర్చకూడా నడుస్తుంది. పెమ్మసాని దూకుడు అసలుకే ఎసరు తెచ్చి పెట్టేలా ఉందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. పెమ్మసాని వరుసగా సమావేశాలు పెట్టడం వరకు బాగానే ఉన్నా… ఆయన తీరుపైన కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతులకు ఫోన్లు రావడంతో కేంద్ర మంత్రి అసహానానికి గురయ్యాట. దీంతో సమావేశం నుండి వెళ్లిపోండి అంటూ మాట్లాడడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు చెప్పే సమస్యలను సరిగా వినడం లేదనే రైతులు గుసగుసలాడుతున్నారట. పెట్టిన మూడు మీటింగుల్లో … చిన్న సన్నకారు రైతులను కలవలేదని… కేవలం జేఏసీ నాయకులనే కలిసి.. వాళ్లు చెప్పిన సమస్యలే విని పరిష్కారం చూపుతామనడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. అమరావతిలో పెద్ద రైతులు కంటే… చిన్న, సన్నకారు రైతుల ఎక్కువ సంఖ్యలో భూములు ఇచ్చారనే విషయాన్ని కేంద్రమంత్రి మర్చిపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ రైతులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు 2014 నుండి ఉన్న సమస్యలు పక్కనపెట్టి… ఇప్పుడున్న సమస్యలు చెప్పాలంటూ పెమ్మసాని మాట్లాడటం కరెక్ట్ కాదనే భావనలో రైతులు ఉన్నారట. 2014 నుండి ఉన్న రైతు సమస్యలు.. రెండేళ్లు ముందు వచ్చిన పెమ్మసానికి ఎలా తెలుస్తాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఏది ఏమైనప్పటికీ… అమరావతి అంశంలో పెమ్మసానికి బాధ్యతలు ఇవ్వడం వరకు బాగానే ఉన్నా.. రైతుల్ని డీల్ చేయడం రాకపోవడం, దూకుడుగా వెళ్లడం పట్ల అన్నదాతల్లో కొంత అసంతృప్తి కనబడుతుందట. మరి పెమ్మసాని చంద్రశేఖర్ రాబోయే రోజుల్లో రాజధాని రైతుల పట్ల ఏ విధంగా ముందుకు వెళతారో..వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.
Story by Kishan, Big Tv