తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చుట్టూ రాజకీయ సెగలు ముసురుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడిన ఎస్ఈసీ, తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీని ఆదేశించింది.
అసలేం జరిగిందంటే…?
సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డు ఇందిరా కాలనీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ విధుల్లో ఉన్న సీసీఎస్ సీఐ శివకుమార్ మరియు స్థానిక కాంగ్రెస్ నేతల మధ్య ఓటర్ల గుర్తింపు విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సీఐ ఒక కాంగ్రెస్ కార్యకర్త కాలర్ పట్టుకున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి అక్కడికి చేరుకుని సీఐ శివకుమార్, హోంగార్డు చెన్నయ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనుచిత పదజాలంతో దూషించారన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఎస్పీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు..
పోలీసు అధికారుల పట్ల జగ్గారెడ్డి ప్రవర్తించిన తీరును ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా.. ఎన్నికల ప్రక్రియలో ఉన్న అధికారులను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రాథమిక సమాచారం సేకరించిన ఎస్ఈసీ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో సంగారెడ్డి పోలీస్ యంత్రాంగం కేసు నమోదుకు సిద్ధమైంది.
జగ్గారెడ్డి సంచలన రియాక్షన్..
తనపై కేసు నమోదు చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై జగ్గారెడ్డి మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ గొడవకు మూల కారణం ఎన్నికల కమిషన్ వైఫల్యమేనని ఆయన ఎదురుదాడికి దిగారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డిలో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఇక్కడ ఓటర్లుగా చేర్చారు. ఒక్కో వార్డులో దాదాపు 300 దొంగ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అవే ఓట్లు వేయడానికి వస్తుంటే మా కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న మా కార్యకర్త గల్లాను సీఐ పట్టుకోవడం ఎంతవరకు సమంజసం?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
అధికారులదే బాధ్యత..
దొంగ ఓట్లను తొలగించడంలో ఎన్నికల కమిషన్, జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. ‘తప్పు చేసిన దొంగ ఓటర్లను, వారికి సహకరిస్తున్న అధికారులను వదిలేసి, అక్రమాలను ప్రశ్నిస్తున్న మాపై కేసులు పెట్టడం ఏంటి? ఈ గొడవకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రస్తుతం ఈ పరిణామం సంగారెడ్డి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.