Telangana: దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సమకూర్చడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి, తెలంగాణ ఒక మోడల్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. తాజాగా ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ (India Industrial Land Bank – IILB) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 157 పారిశ్రామిక పార్కుల పరిధిలో మొత్తం 32,033 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో పరిశ్రమల ఏర్పాటు కోసం ఏకంగా 30,749 హెక్టార్ల భూమి ఇప్పటికే సిద్ధంగా ఉండటం విశేషం. అంటే రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక భూముల్లో దాదాపు 96 శాతం భూమి పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండటం తెలంగాణ ప్రత్యేకతగా నిలిచింది.
ఇది కేవలం గణాంకాల విజయం మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక అభివృద్ధి విధానాలకు ఇది నిదర్శనం. పరిశ్రమల స్థాపనలో పెట్టుబడిదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య భూమి లభ్యత. అయితే తెలంగాణలో ఈ సమస్యను ప్రభుత్వం ముందే గుర్తించి, పారిశ్రామిక పార్కులను క్లస్టర్లుగా అభివృద్ధి చేయడం, అవసరమైన మౌలిక వసతులతో భూమిని సిద్ధంగా ఉంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా వ్యవస్థను రూపొందించింది.
ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ స్థానం ఎంత బలంగా ఉందో.. ఈ నివేదిక మరింత స్పష్టంగా చూపుతోంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 638 పారిశ్రామిక పార్కులు ఉండగా, వాటి పరిధిలో 1,10,595 హెక్టార్ల భూమి ఉంది. అయితే ఇందులో పరిశ్రమలకు వాస్తవంగా అందుబాటులో ఉన్న భూమి కేవలం 10,747 హెక్టార్లు మాత్రమే. అంటే ఏపీలో మొత్తం పారిశ్రామిక భూమిలో 10 శాతం కూడా పరిశ్రమలకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఈ పోలికలో తెలంగాణ ముందంజలో ఉన్నదని స్పష్టంగా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తే, ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ నివేదిక ప్రకారం మొత్తం దేశంలో 4,523 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం సుమారు 7.70 లక్షల హెక్టార్లు కాగా, ప్రస్తుతం పరిశ్రమల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న భూమి కేవలం 1.35 లక్షల హెక్టార్లు మాత్రమే. అంటే దేశవ్యాప్తంగా పరిశ్రమలకు తక్షణమే ఉపయోగపడే భూమి శాతం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న అధిక ల్యాండ్ రెడినెస్ దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ చర్యలు, సింగిల్ విండో విధానం, పారిశ్రామిక పార్కుల్లో రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన ఇవన్నీ కలిసి.. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా మార్చాయి. పరిశ్రమలకు భూమి మాత్రమే కాకుండా, వేగంగా అనుమతులు ఇవ్వడం, పారదర్శక విధానాలు అమలు చేయడం కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
Also Read: చేవెళ్ల బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. టిప్పర్ ఓనరే ప్రధాన నిందితుడు
ఈ గణాంకాలు తెలంగాణకు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కొత్త పరిశ్రమలు స్థాపించడానికి తెలంగాణ ఒక హబ్గా మారే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఉపాధి అవకాశాలు పెరగడం, ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కావడం కూడా సాధ్యమవుతుంది.