Shiv Sena UBT-MNS Alliance: మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్యంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఠాక్రే దాయాదులు (Thackeray Cousins) ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు చేతులు కలిపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై పట్టు సాధించేందుకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (BMC Elections 2026) కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇరువురు నేతలు బహిరంగంగా పొత్తును ప్రకటించారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. “శివసేన మరియు ఎంఎన్ఎస్ ఇకపై కూటమి భాగస్వాములు అని నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను. ముంబైకి మరాఠీ మేయర్ వస్తారు, ఆ వ్యక్తి మా సేన-ఎంఎన్ఎస్ కూటమి నుంచే ఉంటారు” అని స్పష్టం చేశారు. ఆయన పక్కనే ఉన్న ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. “ఏం జరిగినా సరే, ముంబై మాతోనే ఉంటుంది” అని నొక్కి చెప్పారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (MVA), రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీలు రెండూ ఘోర పరాజయం పాలయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే విడివిడిగా ఉంటే సాధ్యం కాదని ఇద్దరూ గ్రహించారు. దీనికి తోడు జూన్ 2025లో ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీరిని ఏకం చేసింది. దీనికి వ్యతిరేకంగా జూలై 5, 2025న ఇద్దరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. ఈ విజయమే వారి పునరేకీకరణకు (Reconciliation) నాంది పలికింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి, ఏప్రిల్ 2025లో రాజ్ చేసిన పాడ్కాస్ట్ వ్యాఖ్యలు కూడా ఈ కలయికకు దోహదపడ్డాయి.
శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వారసత్వం కోసం వీరి మధ్య తీవ్ర పోరు జరిగింది. 2003లో ఉద్ధవ్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడం రాజ్కు మింగుడుపడలేదు. ఉద్ధవ్ ‘మీ ముంబైకర్’ (అందరివాడు) నినాదం ఎత్తుకోగా, రాజ్ మాత్రం వలసదారులకు వ్యతిరేకంగా తీవ్రమైన ‘మరాఠీ మనుస్’ వాదాన్ని వినిపించారు. భావజాల వైరుధ్యాలు, నాయకత్వ పోరు కారణంగా 2005లో రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వచ్చి ఎంఎన్ఎస్ స్థాపించారు. దీనివల్ల గత ఎన్నికల్లో ఓట్లు చీలి కాంగ్రెస్, ఎన్సీపీలకు లబ్ధి చేకూరగా, 2019లో బీజేపీకి వ్యతిరేకంగా రాజ్ గళమెత్తారు.
చివరకు 20 ఏళ్ల తర్వాత, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, మరాఠీ అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి చిన్న చిన్న మనస్పర్థలను పక్కనపెట్టి దాయాదులు ఒక్కటయ్యారు. ఈ పరిణామం రాబోయే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి గట్టి సవాలు విసురుతుందనడంలో సందేహం లేదు.
Read Also: Night shifts Risks: నైట్ షిఫ్టులతో.. ప్రాణాంతక వ్యాధి, జాగ్రత్త పడకపోతే అంతే !