ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు.. మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మే 5వ తేదీన రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వాతావరణం అత్యంత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి.. ములుగు.. వరంగల్.. హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో వాతావరణం అస్థిరంగా ఉండటంతో పాటు పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. పొలాల్లో పనులు చేసే రైతులు.. బయట తిరిగే ప్రజలు ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. పాత భవనాలు.. భారీ వృక్షాలు.. విద్యుత్ స్తంభాల కింద నిలబడటం ప్రాణాపాయమని అధికారులు స్పష్టం చేశారు.
ఇవాళ.. రేపు రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది. గాలి వేగం పెరిగే అవకాశం ఉండటంతో జనజీవనానికి అంతరాయం కలగకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం కోరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 41°C నుంచి 44°C వరకు నమోదవుతూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వర్షాల ప్రభావంతో రాగల మూడు నాలుగు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గి వాతావరణం చల్లబడుతుందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
మరి కాసేపట్లో..
నల్గొండ, యాదాద్రి – భువనగిరి, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, నాగర్కర్నూల్ జిల్లాల్లో మరి కాసేపట్లో వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు ధాన్యం కుప్పలపై పట్టాలు కప్పుకోవాలని.. తడిసిన ధాన్యం వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వడగళ్ల వాన పడే అవకాశాలు కూడా ఉన్నందున ఉద్యానవన పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలి.
వాతావరణంలో సంభవించే ఈ మార్పులు వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయని అధికారులు తెలిపారు. రాగల 48 గంటల పాటు అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగే వీలుందని అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట లభిస్తుంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం.
ALSO READ: విద్యాశాఖను అందుకోసమే మీ దగ్గర పెట్టుకున్నారా..? సీఎంకు కేటీఆర్ సంచలన లేఖ