Cyberabad: స్వేచ్ఛ బ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి వ్యాపార సంస్థ తప్పకుండా డస్ట్ బిన్లను వినియోగించాలని ఇందుకు నో బిన్.. నో బిజినెస్ నిబంధనను అమలు చేయనున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన వెల్లడించారు. వ్యాపార సంస్థల వద్ద డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకుని, చెత్తను బిన్లలో వేయాల్సిన బాధ్యత వ్యాపారులు నిర్వర్తిస్తే, ఆ చెత్త బిన్ ను తీసుకెళ్లే బాధ్యత తమ కార్పొరేషన్ నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
కమిషనర్ మాట్లాడుతూ..
శనివారం ఆమె మాదాపూర్ లోని కమిషనర్ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సొంత భవనాన్ని నిర్మించేందుకు కైతలాపూర్ తో పాటు మొత్తం రెండు చోట్ల స్థలాల అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఒక వార్డు పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ, ఎన్ని గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న విషయాన్ని ఒక రోజు ముందు సాయంత్రం స్థానికులకు, కాలనీ సంక్షేమ సంఘాలకు తెలియజేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రజాసమస్యలను తెల్సుకుని పరిష్కరించేందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆమె వ్యాఖ్యానించారు.
అధికారులపై చర్యలు
ఈ కార్యక్రమంలో గుర్తించిన సమస్యల్లో టాప్ అయిదింటిని ఎంపిక చేసుకుని అదే వార్డులో మళ్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే లోపు ఆ అయిదు సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో కారణాలను అన్వేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన ఫిబ్రవరి 11 నుంచి ఇప్పటి వరకు గడిచిన రెండు నెలల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, వివిధ విభాగాలు, సిబ్బంది, అధికారుల పని తీరుపై తనకు పూర్తిగా అవగాహన కల్గిందని ఆమె వివరించారు.
లిఖితపూర్వకంగా తెలియజేయాలి..
సర్కిళ్లలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల సమస్యలను స్వీకరించనున్నట్లు, ఒక సారి ప్రజావాణిలో స్వీకరించిన సమస్యలు తదుపరి ప్రజావాణి నిర్వహించే లోపు పరిష్కరించాలని అధికారులకు డెడ్ లైన్ విధించినట్లు, వాస్తవానికి అధికారుల పరిధిలో పరిష్కరించలేని సమస్యలుంటే, వాటిని సమర్పించిన ఆర్జీ దారుడికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని కమిషనర్ సూచించారు. పరిష్కరించే అవకాశమున్నా, అలసత్వం చేసి నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా కమిషనర్ సృజన హెచ్చరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులే పదే పదే రిపీట్ కాకుండా ఉండేందుకే ఈ నిబంధనను విధిస్తున్నట్లు కమిషనర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
బిల్లులు పెండింగ్..
కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు రూ.150 కోట్ల వివిధ రకాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆమె వివరించారు. కార్పొరేషన్ లోని మూడు జోన్లలో రూ.110 కోట్లు, రూ. 80 కోట్లు, రూ. 90 కోట్ల నిధులున్నట్లు ఆమె వివరించారు. కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నందున ఈ సారి రెవెన్యూ, వసూళ్లు పెరిగాయని కమిషనర్ వివరించారు. కొత్తగా చేపట్టాల్సిన హెచ్ సిటీ పనుల అంచనా వ్యయం రూ. 2500 కోట్ల వరకు ఉంటుందని, ఆ మొత్తం భారాన్ని సర్కారే భరించి పనులు చేపడితే కార్పొరేషన్ పై భారం తగ్గుతుందని ఆమె వెల్లడించారు.
దోమల నివారణకు కెమికల్ స్ప్రే బెటర్
ప్రస్తుతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల నివారణ కోసం చేపట్టిన ఫాగింగ్, స్ప్రేలలో కెమికల్ స్ప్రేనే బెటర్ ప్రక్రియ అని కమిషనర్ సృజన వ్యాఖ్యానించారు. ఫాగింగ్ దోమల నిర్మూలనకు ఆశించిన స్థాయిలో పని చేయకపోవటంతో ఇకపై కార్పొరేషన్ మొత్తం పరిధిలో కెమికల్ స్ప్రే నిర్వహించనున్నట్లు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లను ముమ్మరం చేయనున్నట్లు ఆమె వివరించారు.
నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టర్లపై చర్యలు
కార్పొరేషన్ పరిధిలో మొత్తం 24 స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, 21 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, 74 జంక్షన్లు, 1540 కిలోమీటర్ల పొడువున ఓపెన్ నాలాలు,428 కార్పొరేషన్ షాపులున్నాయని తెలిపారు. కార్పొరేషన్ కు చెందిన షాపులను పాతకాలం అద్దె విధానంతో కాకుండా కొత్తగా ఈ ప్రస్తుత మార్కెట్ డిమాండ్ కు అనుకూలంగా రేట్లు ఫిక్స్ చేసి అద్దెకు ఇవ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. నాలాల్లో పూడికతీత పనులు సుమారు 80 శాతం వరకు పూర్తయ్యాయని, పనుల పూర్తి, బయటకు తీసిన పూడిక రవాణా వంటి ప్రక్రియలకు సంబంధించి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, పనులను పర్యవేక్షించిన ఇంజనీర్లదే బాధ్యత అని, జరిగని పనిని జరిగినట్లు, తొలగించని పూడికను తొలగించినట్లు చూపాలనే ప్రయత్నం చేస్తే వారిపైనే చర్యలుంటాయని కూడా కమిషనర్ తేల్చి చెప్పారు.
Also Read: దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చూశారా?