Student Protest: హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నేతలు.. బోర్డు కార్యాలయాన్ని ముట్టడించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 300 మంది విద్యార్థులకు హల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ.. కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే జాగృతి స్టూడెంట్ నేతలు కొందరు గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకు దిగిన విద్యార్థి నేతలను అరెస్టు చేసి తమ వాహనాల్లో బలవంతంగా తీసుకెళ్లారు. హాల్ టికెట్ ఇవ్వండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని జాగృతి విద్యార్థి విభాగం నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి.. పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు
అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు కొమ్ముకాస్తు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డ విద్యార్థి నాయకులు
అనుమతి లేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు… pic.twitter.com/uENTiCHuxV
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2026
రాష్ట్రంలో గత రెండేళ్లుగా విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జాగృతి స్టూడెంట్ విభాగ నేతలు ఆరోపించారు. సంబంధిత మంత్రి దీనిపైన ఒక్క ప్రెస్ మీట్ నిర్వహించిన పాపాన పోలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం చేయాలంటూ రోడ్డు మీదకు వస్తే దౌర్జన్యంగా అరెస్టు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే అడిగే హక్కు లేదా? అని నిలదీస్తున్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం తెలంగాణ జాగృతి పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Yllampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టా రాజ్యం.. సమయమైనా కనిపించని అధికారులు