CM Revanth Reddy: దిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇచ్చిన గౌరవ విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ మిషన్ నివాసంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ విందులో సీఎం రేవంత్ తో పాటు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిక్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, పలుదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయుల, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం.. తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ), లాజిస్టిక్స్, తయారీ రంగం, గ్రీన్ వంటి ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చురుకైన విధానాలను తమ ప్రభుత్వం అవలంభిస్తోందని చెప్పారు.
తెలంగాణలో అందుబాటులో ఉన్న విస్తారమైన అవకాశాలను పరిశీలించేందుకు ఒకసారి హైదరాబాద్ ను సందర్శించాలని అతిథులను.. సాదరంగా సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో కొత్త కంపెనీ ఏర్పాటు చేయాడానికి లేదా విస్తరించడానికి ప్రయత్నిస్తున్న కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును అందిస్తోందని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరిగతిన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ కంపెనీలకు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, భవిష్యత్ సహకారాలను పెంపొందించడానికి ఈ విందు ఒక మంచి వేదికగా మారిందని ఈ సందర్భంగా రేవంత్ చెప్పుకొచ్చారు.
Also Read: Terror Alert: బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర.. ఆలయాలే ప్రధాన టార్గెట్!
అంతకుముందు దిల్లీ జరుగుతున్న ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. భారత్ దానిని అందిపుచ్చుకోవాలని రేవంత్ సూచించారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఏఐ సదస్సులు జరగాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. అదే సమయంలో ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను ఈ సందర్భంగా కోరారు.
Also Read: US Tariffs: ప్రపంచ దేశాలపై యూఎస్ 10 శాతం సుంకాలు.. భారత్ కు భారీ ఊరట