Sarpanch Elections: తెలంగాణలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తి కాగానే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన వారిలో విజేతలను ప్రకటించనున్నారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల వాయిదా పడితే రేపు ఆ ఎన్నికను నిర్వహించనున్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు.. స్వతంత్రుల ప్రచారాలతో ఇన్నిరోజులు పల్లె హోరెత్తిపోయింది. తమను అభ్యర్థులుగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ హామీల వర్షం కురిపించారు. గెలిస్తే తాము చేయబోయే పనులు అన్నింటిని పాంప్లెట్స్ పై ప్రింట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఇప్పుడు గెలుపు ఎవర్ని వరిస్తుందో చూడాలి.
మూడో విడతలో మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విడతలో 4,157 గ్రామాలకు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 గ్రామాలు, 7916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3,752 గ్రామ పంచాయతీల్లో 12,640 మంది సర్పంచ్ అభ్యర్థుల పోటీ పడుతున్నారు. కాగా, 11 గ్రామాలకు,112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు.
Also Read: ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తిలో తెలంగాణకు 70% వాటా ఇవ్వాల్సిందే: మంత్రులు
ఇక తుది విడత పోరుకు అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది సిద్దమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ బందోబస్తు కల్పించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పించారు పోలీసులు. మూడో విడుతలో 3,752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఈ విడుతలో అధికార కాంగ్రెస్ హవా కొనసాగిస్తుందా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధిస్తుందా, లేక బీజేపీ పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్#PanchayatElection https://t.co/m00sAbWh2E pic.twitter.com/v41yTsBom9
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2025