RFCL Review:రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL)లో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి, రైతులకు సకాలంలో ఎరువులు అందించడానికి స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఎరువులో కనీసం 70 శాతం తెలంగాణకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంయుక్తంగా ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
గత ఖరీఫ్ సీజన్లో రామగుండం ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్ర ఎరువుల శాఖ గత సీజన్లో రాష్ట్రానికి 2,05,315 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా.. ఉత్పత్తి లోపం వల్ల కేవలం 1,10,720 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. దాదాపు సగం లోటు ఏర్పడినా కేంద్రం సకాలంలో స్పందించలేదని, దీనివల్ల రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రబీ సీజన్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆరా తీశారు. ఉత్పత్తిలో ఏవైనా సాంకేతిక అవాంతరాలు వస్తే, తక్షణమే సరఫరాను భర్తీ చేయడానికి ‘ప్రత్యామ్నాయ ప్రణాళిక’ (Plan-B)తో సిద్ధంగా ఉండాలని ఎన్ఎఫ్ఎల్ (NFL) కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
దీనిపై స్పందించిన ఆర్ఎఫ్సీఎల్ ప్రతినిధులు.. గత ఖరీఫ్లో హెచ్టీఆర్ (HTR) విభాగంలో తలెత్తిన అనుకోని సాంకేతిక సమస్యల వల్లే ఉత్పత్తి నిలిచిపోయిందని, రైతులు పడ్డ ఇబ్బందులకు చింతిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో అలాంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, అక్టోబర్, నవంబర్ నెలల కోటాను ఇప్పటికే సరఫరా చేశామని వివరించారు. డిసెంబర్ నెలకు సంబంధించి 50,450 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
రామగుండంలో నెలకు సుమారు లక్ష టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నా, తెలంగాణకు అందులో 40 నుంచి 50 శాతం మాత్రమే దక్కుతోందని మంత్రి తుమ్మల ఎత్తిచూపారు. స్థానిక ప్లాంట్ నుంచి 70 శాతం కోటా కేటాయిస్తే రవాణా భారం తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని పరిశ్రమల శాఖ ఎండీని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.
ఇదే సమావేశంలో ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్క్లో నెలకొల్పనున్న పరిశ్రమల పురోగతిపైనా మంత్రులు చర్చించారు. వచ్చే జనవరిలో అక్కడ పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయాల్సి ఉన్నందున, అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఎండీ, టీఎస్ఐఐసీ ఎండీ తదితరులు పాల్గొన్నారు.