Tiger: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల జిల్లాలోని దోమకొండ, భిక్కనూర్ మండలాల పరిధిలో పెద్దపులి తిరుగుతున్నట్లు సంకేతాలు లభించడంతో.. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని తాడోబా అడవుల ప్రాంతం నుంచి లేదా మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యం నుంచి పెద్దపులి ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటన జరగడం వల్ల ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సుమారు ఐదు నెలల క్రితం మాచారెడ్డి రేంజ్ పరిధిలో.. పెద్దపులి సంచరించినట్లు గుర్తించారు. అప్పట్లో కొంతకాలం కనిపించకుండా పోయిన పెద్దపులి మళ్లీ ఇప్పుడు దోమకొండ, భిక్కనూర్ మండలాల్లో దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఒకే ప్రాంతంలో పలు రోజులుగా పులి తిరుగుతుండటంతో అక్కడే స్థావరం ఏర్పరుచుకుందేమోనని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
దోమకొండ మండలం అంబర్పేట గ్రామ శివారులో ఇటీవల లేగ దూడలపై.. పెద్దపులి దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పొలాల మధ్య పులి తిరుగుతుండటంతో పశువుల కాపరులు, వ్యవసాయ పనులు చేసుకునే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లేందుకు కూడా వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది.
ఐదు నెలల వ్యవధిలో రెండుసార్లు పెద్దపులి సంచరించడం అటవీశాఖను అప్రమత్తం చేసింది. లేగ దూడలపై దాడి చేసినది పెద్దపులే అని అధికారులు నిర్ధారణకు వచ్చారు. పులి కదలికలను గుర్తించి, దానికి ఎలాంటి హాని జరగకుండా రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పులి జాడను గుర్తించేందుకు మొత్తం తొమ్మిది ట్రాప్ కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి కదలికలు రికార్డు కావడంతో అధికారులు నిఘా మరింత పెంచారు. ఈ ప్రాంతంలో పులి సంచారం స్పష్టంగా ఉన్నట్లు గుర్తించడంతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు పగలు, రాత్రి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నాయి. పులి గ్రామాల్లోకి రాకుండా అటవీ ప్రాంతం వైపే మళ్లించే చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శివారు గ్రామాల ప్రజలు అడవి ప్రాంతాల వైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. పులిని రెచ్చగొట్టే చర్యలు చేపట్టొద్దని, స్వయంగా దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేయొద్దని సూచిస్తున్నారు. ప్రజల భద్రతతో పాటు పులి సంరక్షణ కూడా తమ ప్రధాన లక్ష్యమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read: సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు
సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గ్రామస్తులు.. ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. గ్రామాల్లో దండోరా వేయించి రైతులు, పశువుల కాపరులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పొలాల్లో ఒంటరిగా పనిచేయకుండా గుంపులుగా వెళ్లాలని, పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు.