Mahesh Kumar on Pawan: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న చర్చపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడని, ఆయన ప్రభావం తెలంగాణలో ఉండదని ఆయన స్పష్టం చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ను తెలంగాణ వ్యతిరేకిగా అభివర్ణించారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ.. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను, ఇక్కడి సంస్కృతిని ఉద్దేశించి నీచంగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వ్యక్తి మాటలను ఇక్కడి ప్రజలు ఏమాత్రం పట్టించుకోరని.. ఆయన చెబితే ఓట్లు వేసే పరిస్థితి తెలంగాణలో లేదని ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని, దీంతో భయపడిన బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ శరణు కోరారని మహేష్ గౌడ్ విమర్శించారు. బీజేపీ కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి ‘భిక్షం దేహి’ అన్నట్లుగా సహాయం కోరడం వారి నిస్సహాయతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ పవన్ కళ్యాణ్ను ఆశ్రయించిందని ఆయన పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ తన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేసుకోవాలని, తెలంగాణ రాజకీయాల్లో ఆయన జోక్యం అవసరం లేదని మహేష్ గౌడ్ సూచించారు. పవన్ కళ్యాణ్ను దిష్టి కళ్యాణ్ అని సంబోధిస్తూ.. ఆయన రాకతో తెలంగాణలో కాంగ్రెస్ దూకుడును ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నవారికే పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు.
Also Read: తిరుమల చుట్టూ రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీ నేతలకు భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరిక!
తెలంగాణలో ఉనికి కోసమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బీజేపీ ఆశ్రయించింది: మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ చీఫ్
గతంలో తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ నీచంగా మాట్లాడారు
పవన్ కళ్యాణ్ చెబితే తెలంగాణ ప్రజలు ఓటు వేయరు
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం తథ్యం… https://t.co/GG5tUa1rqj pic.twitter.com/G8dvcVfDVi
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2026